Telangana Govt: కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు, ప్రకటనలో ప్రజలకు అనేక శుభవార్తలు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. జనవరిలో అనేక నిర్ణయాలు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో ప్రధానంగా కుల గణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది. అలాగే, ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించనున్నది.
కుల గణనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 97 శాతం మేర వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అన్ని వివరాలు కాకుండా.. అవసరమైన వాటిని ప్రభుత్వం బయట పెట్టనున్నది. ఇక బీసీ డెడికేటెడ్ కమిషన్కుకు కూడా ఎంత వరకు సమాచారం అవసరం పడుతుందో అంతే ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానున్నది.
ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టి.. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.
Also Read:ప్రోటోకాల్ రగడ.. రేవంత్ దగ్గర వంశీ పంచాయితీ
కొంత కాలంగా నానుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా జనవరిలోనే మొదలు కానున్నాయి. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల వడపోత నడుస్తున్నది. అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్ధిదారుల లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. పండగ తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలోనే మొదలుపెట్టనున్నారు. వీటన్నింటికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది.