Telangana Rising In Davos: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. దావోస్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి టీమ్ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటోంది. దాదాపు 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వానికి-ఆ కంపెనీ మధ్య సంతకాలు జరిగాయి.
రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మేఘా కంపెనీ అధినేత ప్రకటించారు. దీంతోపాటు ఆ సంస్థ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది.
రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 100 ఎంవీహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేయనుంది. దీనికి రూ. 3000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రెండేళ్లలో 1000 మందికి ప్రతక్ష్య ఉద్యోగాలు, 3000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
ALSO READ: తెలంగాణలో రాకెట్ తయారీ.. స్కైరూట్ తో సర్కార్ ఒప్పందం.. గర్వకారణమన్న సీఎం రేవంత్ రెడ్డి
పర్యాటక రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది మేఘా కంపెనీ. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది.