Group-1 Result: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో వేగంగా అడుగులు వేస్తోంది టీజీపీఎస్సీ. గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది.
563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. న్యాయ వివాదం నేపథ్యంలో ఓ పోస్టును విత్హెల్డ్లో పెట్టినట్టు తెలిపారు. మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేసింది టీజీపీఎస్సీ.
అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను 1:1 నిష్పత్తిలో ఏప్రిల్ 16 నుంచి 22 వరకు చేపట్టింది. అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని వాటి ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేసింది. ఎంపికవారి జాబితాను ఓసారి చూద్దాం. గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ఆర్డీవో పోస్టులు ఎంపిక చేశారు.
లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి ఆ జాబితాలో ఉన్నారు. అయితే ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించింది టీజీపీఎస్సీ. ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం, పత్రాలు ఇచ్చినట్లు తేలితే వారి నియామకాలు ఏక్షణమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
ALSO READ: సినిమా స్టయిల్ లో ఇంట్లోకి వెళ్లి నవవధువును ఈచ్చుకుంటూ కారులోకి
టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఇక గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 900 మార్కులకు 550 మార్కులు సాధించిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన ఆమె, ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేశారు. ఆర్డీవో పోస్టుకు ఆమె ఎంపికయ్యారు.
మల్టీజోన్-1 కేటగిరీలో టాపర్గా నిలిచింది హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని. ఆమె 532 మార్కులు సాధించారు. ఆమె మండల పంచాయతీ అధికారిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆర్డీవో పోస్టు ఇచ్చినట్టు కమిషన్ వెల్లడించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో స్టేట్ వైడ్ రెండో ర్యాంకు సాధించారు. ఆయనకు ఆర్డీవో పోస్టు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గ్రూప్-1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో 10 ర్యాంకుల్లో ఆరుగురు విజయం సాధించారు. టాప్-50ల్లో 25 మంది మహిళలు ఉన్నారు. అదే 100 ర్యాంకులను పరిశీలిస్తే అందులో 41 మంది మహిళలున్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఇంగ్లీష్ మినహా 500పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ కనబరిచారు.