Health Transfers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న జనరల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీల కోసం అధికారులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ఆన్లైన్ కౌన్సెలింగ్కు ప్రాధాన్యత ఇస్తుండగా, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. బదిలీల విధివిధానాలపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగినప్పటికీ, అధికారులు మాత్రం ఆన్లైన్ ఆప్షన్లకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ, సాఫ్ట్వేర్ ఆధారిత కేటాయింపులకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
దీనివల్ల సీనియారిటీ ఉన్న వారికి కూడా కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ దక్కుతుందా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది. గత అనుభవాల దృష్ట్యా ఆన్లైన్ పోర్టల్(Poratal)లో డేటా తప్పుగా నమోదు కావడం, సీనియారిటీ జాబితాలో వ్యత్యాసాలు రావడం ప్రధాన అభ్యంతరంగా ఉంది. అంతేగాక ఆన్లైన్(Online) విధానంలో భార్యాభర్తల కేటగిరీ, అనారోగ్య కారణాలను సాఫ్ట్వేర్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందనే దానిపై స్పష్టత లేదు. దీని వలన జిల్లాలో ఉన్న వాస్తవ ఖాళీలను పోర్టల్లో సరిగ్గా చూపకపోవడం వల్ల మెరిట్ ఉన్న వారు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆప్ లైన్ లో నే పోస్టింగ్ ల ప్రాసెస్ జరగాలని వైద్య సంఘాలు కోరుతున్నాయి.
Also Read: టాటా డబుల్ బ్లాస్ట్.. మే 22న సియెర్రా EV, సఫారీ EV లాంచ్!
బదిలీల ప్రక్రియ లో భాగంగా జిల్లాల వారీగా వివరాల సేకరణ వేగవంతమైంది. ఏయే ఆసుపత్రుల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? గత ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారు ఎవరు? అనే వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు. అయితే, ఈ డేటా సేకరణలోనూ కొన్ని చోట్ల గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుండగానే, మరోవైపు వైద్య యూనియన్ సంఘాలు తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ సానుభూతిపరులకు అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇప్పించుకునేందుకు గాను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద ముమ్మరంగా లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా కీలకమైన పట్టణ ప్రాంత ఆసుపత్రుల్లో సీట్ల కోసం భారీగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కొన్ని సంఘాలు బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఒత్తిడి చేస్తుండగా, మరి కొంత మంది యూనియన్ నాయకులు తమ అనుచరుల కోసం అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం ఆఫీస్ బేరర్లు అనే అస్త్రాన్ని కూడా వాడనున్నారు. ప్రభుత్వం మాత్రం కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవో(GO) ప్రకారం ట్రాన్స్ఫర్లు ఉంటాయని తేల్చి చెప్పింది. అడ్మినిస్ట్రేషన్(administration), టీచింగ్(Teaching), క్లినికల్(Clinical) వర్క్కు ఇబ్బంది లేకుండా అన్ని జిల్లాల్లోని కాలేజీలు, హాస్పిటళ్లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి బదిలీలు తప్పనిసరి అంటూ సర్కార్ నొక్కి చెప్పింది.
Also read: బండి భగీరథ్ కేసుపై బీఆరెస్ గాయిగత్తర … టీఆరెస్ హుందా ప్రవర్తన..!