GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కుంటుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడెవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు పంపింది. జనగణన-2027 ప్రక్రియ నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై ఆంక్షలు అమల్లో ఉన్నపుడు ఈ విభజన చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం స్పందించింది.
Also Read: Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సమస్యకు చెక్? మంత్రి పదవి పై తేల్చనున్న హై కమాండ్
జీహెచ్ఎంసీ పునర్విభజనను సవాల్ చేస్తూ దరం గురువా రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ రాజ్ కుమార్ గుమ్మి వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా జనగణన-2027 కోసం జ్యూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమల్లో ఉందని కోర్టుకు వివరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సరిహద్దులను మార్చడానికి వీల్లేదని వివరించారు. జనగణన నేపథ్యంలో ఏవైనా సరిహద్దు మార్పులు చేయాలంటే గత సంవత్సరం 2025 డిసెంబర్ 31 లూపే మార్పులు చేసుకోవాలని కేంద్రం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా 2027 మార్చి 31 వరకు ఎటువంటి రెవెన్యూ సరిహద్దులను మార్చడానికి వీల్లేదని నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11, 2026న జీవో నెంబర్ 55ను జారీ చేయడం చట్టవిరుద్ధమని వాదించారు. అధికార పరిధిని అతిక్రమించి జారీ చేసిన ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్నన్యాయస్థానం, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నుంచి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1 నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు సరిహద్దుల మార్పుపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా ఈ ఆంక్షల కాలంలోనే జీహెచ్ఎంసీని విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ కేసులో తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు తెలిసింది.
Also Read: JioHotstar ChatGPT: జియోహాట్స్టార్లో చాట్జీపీటీ పవర్.. మీ మూడ్ని బట్టి సినిమాలు.. కొత్త ఫీచర్