High Court: హైదరాబాద్లో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘హైడ్రా’ చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం అధికారులకు అలవాటుగా మారిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్ వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో చేపట్టిన కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
విలువైన కోర్టు సమయం వృథా
ఈ విచారణ సందర్భంగా హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా తీసుకుంటున్న తొందరపాటు చర్యల కారణంగా ఇతర అధికారులు కూడా కోర్టుకు వచ్చి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. అధికారుల ఇష్టారాజ్య వైఖరి వల్ల న్యాయస్థానం యొక్క విలువైన సమయం వృథా అవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశం
పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సదరు స్థలానికి సంబంధించి ఇప్పటివరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా అక్కడ చేపట్టిన కూల్చివేతలు ఎన్ని? అనే వివరాలపై పూర్తి నివేదిక అందించాలని మేడ్చల్ కలెక్టర్ను ఆదేశించింది. అలాగే ఈ కూల్చివేతలపై క్లారిటీ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు సూచించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికలతో హాజరుకావాలని పేర్కొంటూ, తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
Also Read: పవర్ ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ చెక్.. 14 లక్షల వ్యవసాయ పంప్సెట్లకు NPDCL గుడ్ న్యూస్!