TGNPDCL Power: స్వేచ్ఛ బ్యూరో: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో సుమారు 14 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండటంతో గ్రామీణ విద్యుత్ ఫీడర్ల పై ఇండక్షన్ లోడ్ అధికంగా పడుతుండటం వల్ల పవర్ ఫ్యాక్టర్ తగ్గి, విద్యుత్ ప్రవాహం పెరిగి వోల్టేజ్ డ్రాప్ ఏర్పడుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా గత రెండున్నరేళ్లలో టీజీఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు 303, అలాగే 1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు 89 ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు.
అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు..
రైతాంగానికి నాణ్యమైన, స్థిరమైన వోల్టేజ్తో విద్యుత్ సరఫరా అందించడంతో పాటు సాంకేతిక విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గాయని, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మోటార్ల కారణంగా ఏర్పడే రియాక్టివ్ పవర్ డిమాండ్ను నియంత్రించేందుకు సబ్స్టేషన్లు, 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశామని చెప్పారు. 392 కెపాసిటర్ బ్యాంకుల ద్వారా పీటీఆర్ సామర్థ్యం పెరిగిందని, తద్వారా అనేక ప్రాంతాల్లో వెంటనే అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఉండదని పేర్కొన్నారు.
అదనంగా కొత్త పీటీఆర్ల ఏర్పాటు..
కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అదనంగా కొత్త పీటీఆర్ల ఏర్పాటు అవసరం లేదని, తద్వారా రూ.21 కోట్ల మేర డబ్బులు ఆదా అవుతుందని పేర్కొన్నారు. 11 కేవీ ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంకులు పెట్టడం వల్ల సుమారు రూ.82 కోట్ల మేర సాంకేతిక నష్టాలు తగ్గినాయని పేర్కొన్నారు. సబ్స్టేషన్ స్థాయిలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులతో పాటు 11 కేవీ ఫీడర్ స్థాయిలో 600 కేవీఏఆర్ సామర్థ్యం కలిగిన కెపాసిటర్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేశామని, లైన్లలో వోల్టేజ్ డ్రాప్ తగ్గి, ముఖ్యంగా ఫీడర్ చివరి ప్రాంతాల్లో వోల్టేజ్ ప్రొఫైల్ మెరుగుపడుతుందని వివరించారు. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్లతో పాటు ఇతర వినియోగదారులకు కూడా మరింత స్థిరమైన వోల్టేజ్ అందుతుందని అన్నారు.
కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు..
కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుతో సబ్స్టేషన్ల వద్ద పవర్ ఫ్యాక్టర్ కూడా గణనీయంగా మెరుగుపడుతోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఫీడర్లలో తక్కువ వోల్టేజ్ సమస్య రాకుండా కెపాసిటర్ బ్యాంకులు, వోల్టేజ్ బూస్టర్లు పెట్టడం వల్ల రైతాంగానికి మెరుగైన వోల్టేజ్ అందుతోందన్నారు. అటవీ ప్రాంతాలు, పొడవైన లైన్లు ఉన్న ప్రాంతాల్లో ప్రతి సమస్యకు కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ఆచరణాత్మకంగా సాధ్యంకాని పరిస్థితుల్లో, అవసరాన్ని బట్టి వోల్టేజ్ బూస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా వోల్టేజ్ సమస్యను పరిష్కరించామన్నారు. ఈ క్రమంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో మొత్తం 8 వోల్టేజ్ బూస్టర్లు ఏర్పటుచేసినట్లు చెప్పారు.
Also Read:ట్రంప్ టవర్స్ ఎఫెక్ట్.. హైదరాబాద్లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయా?