Vahan Portal: స్వేచ్ఛ బ్యూరో: వాహన కొనుగోలు దారులకు రవాణాశాఖ మరో గుడ్ న్యూస్ చెబుతోంది. సోమవారం(ఈ నెల 23) నుంచి వాహన్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ వాహన్ పోర్టల్ తో 52 రకాల సర్వీసులను వాహనదారులకు అందజేస్తుంది. తెలంగాణ ‘వాహన్’లో చేరడం వల్ల ‘వన్ నేషన్-వన్ రిజిస్ట్రీ’ లక్ష్యంను ప్రభుత్వం చేరుతోంది.
రాష్ట్రంలోవాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు పలు రకాల పౌరసేవలను రావాణాశాఖ ఆన్ లైన్ లో వాహనదారులకు అందుబాటులోకి తెస్తుంది. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ 2016లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్ను రూపొందించింది. ‘వాహన్’, ‘సారధి’ పోర్టల్లు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాఫీగా సాగనుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో రాష్ట్రంలో ఈ పోర్టల్ అమలు కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పోర్టల్ ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. సారధిని అమలు చేసిన రవాణాశాఖ ఇప్పుడు వాహన్ ను అమలుకు కసరత్తు ప్రారంభించింది. రవాణాశాఖ ఉద్యోగులను డివిజనల్ గా విభజించి ఈ పోర్టల్ పై శిక్షణ ఇచ్చారు. ఆటోమోబైల్ డీలర్ల(షోరూం యాజమానులు)కు సైతం ఈ పోర్టల్ పై అధికారులు అవగాహన కల్పించారు. సాంకేతిక పరంగా ఓకే కావడంతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి సెకండ్ హ్యాండ్, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసే వారికి ‘వాహన్’ పోర్టల్ గుడ్న్యూస్ లాంటిది. టెన్షన్ లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఇంటికే వాహన ఆర్సీ రాబోతుంది. ఇతర ‘రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ’ సులభతరం కానుంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు లేదా అక్కడి వారు ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. గతంలో అవసరమైన పత్రాల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మధ్య వర్తులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇకపై కేంద్ర సర్వర్లో డేటా అందుబాటులో ఉండటం వల్ల ఎన్ఓసీ వంటి సాంకేతిక ప్రక్రియ నిమిషాల వ్యవధిలోనే ఆన్లైన్ లోనే ప్రక్రియ వేగవంతం కానుంది.
అంతేకాదు వాహన యజమాని అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ , హైపోథికేషన్ ఎంట్రీ, రిమూవల్ వంటి 52 రకాల సర్వీసులు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసే వారు ఆ వాహనం గత హిస్టరీ, పెండింగ్ చలాన్లు, ఇంజిన్ ఛాసిస్ నంబర్లను సులభంగా సరిచూసుకోవచ్చు. గూడ్స్ వెహికల్స్ రోడ్ ట్యాక్స్ చెల్లింపులు, ఈ-చలానాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏకీకృతం అవుతుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనల్లోనూ వాహనాల జాడను తేలిగ్గా కనిపెట్టొచ్చు. నేర నియంత్రణలోనూ పోలీసులకు వెసులుబాటు కలుగుతుంది. ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం లేకుండా డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్ల ద్వారా డిజిటల్ ఆర్సీలను చూపించే వెసులుబాటు కూడా వాహనదారులకు కలుగుతుంది. అంతేకాదు లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిట్ నెస్ పరీక్షలకు మాత్రమే స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. మిగతావి అంటూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్సులు, చిరునామా బదిలీ, వాహనాల బదిలీ, పర్మిట్లు, ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల సర్వీసులు ఆన్ లైన్ ద్వారానే లభిస్తాయి.
ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సోమవారం (ఈ నెల 23న) రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేటలోని ఓ ప్రైవేటు షోరూంలో ప్రారంభించనున్నట్లు ట్రాన్స్ పోర్టు కమిషన్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమౌతుందని, వాహన్ తో అనుసంధానం వల్ల తెలంగాణ కు చెందిన వాహనాలు జాతీయ డాటా బేస్ లోకి వెళ్ళనున్నాయని తెలిపారు. అంతే కాకుండా రెండవ వాహనాలకు వర్తించే అదనపు 2% జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ రద్దు సోమవారం నుంచి అమలు లోకి వస్తుందని వెల్లడించారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రవాణాశాఖ కృషిచేస్తుందని తెలిపారు.
Also Read: Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ