Online RTA Services: స్వేఛ్చ బ్యూరో: వాహన కొనుగోలు దారులకు రవాణాశాఖ మరో గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతుంది. మార్చి 17 నుంచి వాహన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగులకు, షోరూం(ఆటో మొబైల్)డీలర్లకు శిక్షణ ఇస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ వాహన్ పోర్టల్ తో 52 రకాల సర్వీసులను అందజేయబోతున్నారు. తెలంగాణ ‘వాహన్’లో చేరడం వల్ల ‘వన్ నేషన్-వన్ రిజిస్ట్రీ’ లక్ష్యం దిశగా సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలోవాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు పలు రకాల పౌరసేవలను రావాణాశాఖ ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. పైలట్ ప్రాజెక్టుగా సారధిని సికింద్రాబాద్ లోనే ప్రారంభించి ఆతర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. ఇప్పుడు కూడా వాహన్ పోర్టల్ ను సైతం సికింద్రాబాద్ నుంచే ప్రారంభించబోతున్నారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ 2016లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్ను రూపొందించింది. ‘వాహన్’, ‘సారధి’ పోర్టల్లు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాఫీగా సాగనుంది. అయితే గత ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో రాష్ట్రంలో ఈ పోర్టల్ అమలు కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పోర్టల్ ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. సారధిని అమలు చేసిన రవాణాశాఖ ఇప్పుడు వాహన్ ను అమలుకు కసరత్తు ప్రారంభించింది. రవాణాశాఖ ఉద్యోగులను డివిజనల్ గా విభజించి ఈ పోర్టల్ పై శిక్షణ ఇచ్చారు. ఆటోమోబైల్ డీలర్ల(షోరూం యాజమానులు)కు సైతం ఈ పోర్టల్ పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 17 నుంచి వాహన్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి సెకండ్ హ్యాండ్, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసే వారికి ‘వాహన్’ పోర్టల్ గుడ్న్యూస్ లాంటిది. టెన్షన్ లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఇంటికే వాహన ఆర్సీ రాబోతుంది. ఇతర ‘రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ’ సులభతరం కానుంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు లేదా అక్కడి వారు ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. గతంలో అవసరమైన పత్రాల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మధ్య వర్తులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇకపై కేంద్ర సర్వర్లో డేటా అందుబాటులో ఉండటం వల్ల ఎన్ఓసీ వంటి సాంకేతిక ప్రక్రియ నిమిషాల వ్యవధిలోనే ఆన్లైన్ లోనే ప్రక్రియ వేగవంతం కానుంది.
Also Read: Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?
అంతేకాదు వాహన యజమాని అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ , హైపోథికేషన్ ఎంట్రీ, రిమూవల్ వంటి 52 రకాల సర్వీసులు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసే వారు ఆ వాహనం గత హిస్టరీ, పెండింగ్ చలాన్లు, ఇంజిన్ ఛాసిస్ నంబర్లను సులభంగా సరిచూసుకోవచ్చు. గూడ్స్ వెహికల్స్ రోడ్ ట్యాక్స్ చెల్లింపులు, ఈ-చలానాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏకీకృతం అవుతుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనల్లోనూ వాహనాల జాడను తేలిగ్గా కనిపెట్టొచ్చు. నేర నియంత్రణలోనూ పోలీసులకు వెసులుబాటు కలుగుతుంది. ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం లేకుండా డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్ల ద్వారా డిజిటల్ ఆర్సీలను చూపించే వెసులుబాటు కూడా వాహనదారులకు కలుగుతుంది. అంతేకాదు లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిట్ నెస్ పరీక్షలకు మాత్రమే స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. మిగతావి అంటూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్సులు, చిరునామా బదిలీ, వాహనాల బదిలీ, పర్మిట్లు, ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల సర్వీసులు ఆన్ లైన్ ద్వారానే లభిస్తాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్ లోనూ ఆన్ లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలని రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచి ఎల్.ఎల్.ఆర్ లు పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ ట్రాక్ లో అధికారులు నిర్వహించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
Also Read: Manasa Varanasi: శ్రీలీలను రీప్లేస్ చేస్తుందా? ఎంక్వైరీలు మొదలయ్యాయట!