Ponguleti Srinivas: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పరిస్థితిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో సమీక్ష చేపట్టిన మంత్రి, శాఖల వారీగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై వేటు, హెచ్చరికలు
ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాతను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, సమీక్షలో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన రాయికల్ ఎమ్మార్వో నాగార్జునకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, బకాయిల చెల్లింపు
గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడిన మంత్రి, గతంలో పేరుకుపోయిన ఇందిరమ్మ ఇండ్ల బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత సిఫార్సులకు తావుండదని స్పష్టం చేశారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, తమ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 8 లక్షల ఇండ్లను ప్రజలకు అందజేసిందని, ప్రజలు మెచ్చిన ఏకైక ప్రభుత్వం తమ ఇందిరమ్మ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ధరణి రద్దు, భూ భారతి అమలు
గతంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణి వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో సరళీకృతంగా ‘భూ భారతి’ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా నిలిపివేయలేదని చెప్పారు. అయితే, నాటి నాయకులు భూ భారతి అమలులో కూడా అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.