Minister Ponguleti: తెలంగాణకు ఇంధనాన్ని అందించకుండా కేంద్రం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైతే కేంద్రంతో కొట్లాడతామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. రాష్ట్ర కోటా సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మరోవైపు ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించే లక్ష్యంతో ప్రజాదర్బార్ ను నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన న్యాయబద్ధమైన దరఖాస్తులన్నింటినీ మూడు నెలల్లోగా పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా విభజించి, ప్రతి దరఖాస్తుపై జవాబుదారీతనంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మనిషికి ఆధార్ లాగే, ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూసుమంచి మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమ చేస్తున్నాం అని స్పష్టం చేశారు.
Also Read: బెంగాల్ ఎగ్జిట్ పోల్స్.. దీదీ హ్యాట్రిక్ కొడుతుందా? కమలం వికసిస్తుందా? షాకింగ్ రిపోర్ట్!
నిరుద్యోగ యువత కోసం మే 4న ఖమ్మంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. 80కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అటు వరి, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని.. నిధులను రికార్డు సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రోవైపు భూసేకరణ వంటి పెండింగ్ అంశాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.