తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరత అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించామని వెల్లడించారు. నిన్ననే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి తాజా పరిణామాలను చర్చించినట్లు తెలిపారు.
సిలిండర్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎస్తో పాటు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సరఫరాలో అవాంతరాలు కలగకుండా ఈ కమిటీలు నిరంతరం నిఘా ఉంచుతాయని మంత్రి వివరించారు. ఈ రోజు ఎల్పీజీ సరఫరాదారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొరత వస్తుందనే భయంతో చాలామంది అవసరానికి మించి సిలిండర్లను బుక్ చేస్తున్నారని, ఇది కృత్రిమ కొరతకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలని కోరారు. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
మరోవైపు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన అదనపు డొమెస్టిక్ గ్యాస్ కోటాను వెంటనే కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థలో ఎక్కడా లోపాలు లేకుండా చూస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ: Kumari Aunty: కుమారి ఆంటీ స్టాల్కు గ్యాస్ కష్టాలు.. వంట తగ్గిందంటూ ఆవేదన, ఇదిగో వీడియో