Congress Families: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీకి అశ్వారావుపేట నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. దమ్మపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి చెందిన ఏకంగా 50 కాంగ్రెస్ కుటుంబాలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో చేరాయి.
గులాబీ కండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే
స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలోకి వచ్చిన 50 కుటుంబాల వారికి ఆయన స్వయంగా గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ విధానాలపై అసంతృప్తి
ఈ సందర్భంగా చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంతేకాకుండా, సంక్షేమ పథకాల పంపిణీలో అక్రమాలు, అవినీతి పెరిగిపోవడం వల్లే తాము కాంగ్రెస్ను వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మార్మోగిన ‘మళ్లీ కేసీఆర్ రావాలి’ నినాదాలు
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ‘మళ్లీ కేసీఆర్ రావాలి’ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు, సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. కావడిగుండ్ల గ్రామంలో ఒకేసారి 50 కుటుంబాలు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?