తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాతో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఆకస్మికంగా గాలివానలు వచ్చే వీలుంది.
ఈ సమయాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ శబ్దాలతో కూడిన పిడుగులు పడొచ్చని పేర్కొన్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పాత భవనాలు, చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.
నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తమ పంట పొలాల వద్ద జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆరుబయట ఎండబెట్టిన ధాన్యం విషయంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం అని అధికాులు చెప్పారు.
విద్యుత్ స్తంభాల వద్ద గానీ భారీ వృక్షాల కింద గానీ వాహనాలను నిలపవద్దు. వర్షం కురిసే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల సూచనలను గమనిస్తూ ఉండాలి. రాబోయే ఒక రోజు వరకు వాతావరణం ఇలాగే అస్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
ALSO READ: కస్టమ్లకు బిగ్ అలర్ట్.. మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, హాలీడే లిస్ట్ ఇదిగో