Wyra town: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ పదం చాలా సందర్భాల్లో ఇప్పుడు రోజులకు అతికినట్టు సరిపోతుంది. టెక్నాలజీ పరంగా ఇప్పుడు కాస్త మార్పులు వచ్చాయి. తాజాగా అర్ధరాత్రి ఓ చికెన్ సెంటర్ చోరీకి గురైంది. నమ్మడానికి విచిత్రంగా ఉంది. వెనకటికి అంటే మూడు దశాబ్దాల కిందట ఇళ్లలోని కోళ్లను దొంగతనాలు జరిగిన సందర్భాలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు చికెన్ సెంటర్ వంతైంది.
ఖమ్మం జిల్లా వైరాలోని జాతీయ ప్రధాన రహదారి పక్కనేవున్న ఎస్ఆర్ సుగుణ చికెన్ సెంటర్లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో బాయిలర్ కోళ్లు అపహరణకు గురయ్యాయి. ఆ సెంటర్లోని వెయిట్ మిషన్ కూడా దోచుకెళ్లారు. ఈ ఘటన వెనుక వైరా పట్టణంలోని సత్రంబజార్కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్ఆర్ సుగుణ చికెన్ సెంటర్ ముందు భాగంలో రెంచీలతో నట్లు ఓపెన్ చేశాడు. ఆ తర్వాత జాలి తలుపు తాళం పగులగొట్టి సెంటర్ లోకి ప్రవేశించాడు. షాపులో సుమారు రూ.5 వేలు విలువ చేసే బాయిలర్ కోళ్లు ఎత్తుకెళ్లాడు. అంతేకాదు వెయిట్ మిషన్ను కూడా అపహరించాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరీకి గురైన కాంప్లెక్స్లో మరొక చికెన్ సెంటర్లో ఆ యువకుడు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యాడు.
మంగళవారం ఉదయం వచ్చిన యజమాని వెంకటేశ్వర్లు షాపును చూసి షాకయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీకి పాల్పడిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి నుంచి వెయిట్ మిషన్ను, కోళ్లను విక్రయించగా వచ్చిన నగదు రికవరీ చేసినట్టు సమాచారం.
ALSO READ: నకిలీ రాపిడో డ్రైవర్ హల్చల్.. బండారం బయటపెట్టిన యువతి! చార్మినార్ వద్ద ఏం జరిగింది?