Thummala Nageswara Rao : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Sita Rama Lift Irrigation Project ) తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు.
అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనదని పేర్కొన్నారు. పనులను రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలని చెప్పారు. మోడ్రన్ టెక్నాలజీని వినియోగించి పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. టన్నెల్ పనులు పూర్తయితే బేతుపల్లి, లంకాసాగర్కు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు. గండుగులపల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనదని పేర్కొన్నారు. టన్నెల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.