Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్ప్రెస్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్-విశాఖ మధ్య ఓ ట్రైన్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ట్రైన్పై తరచుగా ఆకతాయిలు రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపుతోంది.
ఇటీవల విశాఖలో కొందరు ఆకతాయిలు ట్రైన్పై రాళ్లు విసరడంతో.. అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు తిరిగి కొత్త అద్దాలను అమర్చారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది.
ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. మహబూబాబాద్-గార్ల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో బోగి అద్ధాలు ధ్వంసమయ్యాయి. సీ-8 కోచ్లోని 41, 42, 43 వద్ద ఉన్న అద్దం పగిలిపోయింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.