Ramadevi: ఖమ్మం జిల్లాకు చెందిన వేములవాడ రాజన్న క్షేత్ర ఈఓ రమాదేవి, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను బుధవారం స్వీకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె సిబ్బందిని హెచ్చరించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఈఓ రమాదేవికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులలో వి.ఐ.పి (VIP)లు, సామాన్య భక్తులు అనే వ్యత్యాసం ఉండకూడదని, అందరినీ ఒకేలా గౌరవిస్తూ స్వామివారి దర్శనం కల్పించాలని అధికారులను, అర్చకులను ఆదేశించారు. భక్తులు స్వామివారికి సమర్పించే బంగారం, వెండి కానుకలకు సంబంధించి విధిగా రసీదులు అందజేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే ఆలయంలో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గత ఈఓ హయాంలో తీసుకున్న మంచి నిర్ణయాలను, అభివృద్ధి పనులను యధావిధంగా అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. విధుల్లో చేరిన మొదటి రోజే ఆమె భక్తులతో నేరుగా మాట్లాడి ఆలయంలోని వసతులు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలయ ఉద్యోగుల వివరాలను సేకరించి, పనితీరుపై నివేదిక కోరారు.
Also Read: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!
https://twitter.com/ChotaNewsApp/status/2029138663624589332