Harish Rao: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే టార్గెట్ చేస్తూ.. అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ డీజీపీని ఉద్దేశిస్తూ.. రాజకీయ కుట్ర కేసుల్లో తొందరపాటు అసలు పని చేయదని.. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అర్థరాత్రి అరెస్ట్లు ఏంటని ప్రశ్నించారు. పోలీసులు చట్టాలకు లోబడి పని చేయాలని సూచించారు. పండుగ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు అరెస్ట్లు చేయడం మానుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చూసి తట్టుకోలేక పోతున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన 28 కేసులు రేవంత్ సర్కార్ పెట్టినవి కాదా అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆహ్వానం మేరకే కౌశిక్ రెడ్డి మీటింగ్ కు వెళ్లారని చెప్పారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరులో ఏమాత్రం తప్పు లేదని అన్నారు. సమావేశంలో సభ్యుడిగా నువ్వే ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావ్.. అని ఎమ్మెల్యే సంజయ్ను నిలదీశాడు. ఇందులో ఎలాంటి తప్పు లేదని హరీష్ రావు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి.. పార్టీ బట్టలిప్పుతా అంటే చూసుకోంటూ ఊరుకోవాలా.. అని ప్రశ్నించారు. ఇందులో కౌశిక్ రెడ్డి తప్పేం లేదని అన్నారు. ఒక్క రోజు అయినా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని పగా.. ప్రతీకారంతో చేసిన అరెస్టే తప్ప ఇది మరొకటి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని ఈ రకంగా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎల్లో జోన్లో హైదరాబాద్..
పోలీసులు తన పని తాను చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వింటున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్లో ఉందని… ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రినే ఉండి తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలనపై మీ దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నామన్నారు.
నిజాయితీగా ఉంటే రాజీనామా చేయాలి..
స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని గుర్తుచేశారు. తెలంగాణ హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండటంతో ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయని… న్యాయం నిలబడుతుందని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే నిజాయితీగా వెంటనే రాజీనామా చేసిన కాంగ్రెస్ తరఫున పోటీచేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు.