Hanumakonda: కారణాలు ఏమైనా కావచ్చు. రెండు రోజులుగా ఓ కారు డిక్కీ నుంచి మృతదేహం వాసన రావడంతో స్థానికులు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఒకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా ఓ కారు కనిపించింది. ఆ ప్రాంతంలో ఓ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. బహుశా దాన్ని ఎవరైనా కొనుగోలు చేయడానికి వచ్చారని భావించారు. రెండు రోజులుగా కారు అక్కడే ఉంది. ఆ కారుని స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే కారు డిక్కీ వద్ద దారుణమైన చెడు వాసన రావడం మొదలైంది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కారు డిక్కీని ఓపెన్ చేశారు. అందులో మహిళ మృతదేహం మూట కట్టి కనిపించడంతో షాకయ్యారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతురాలు గోదావరి ఖనికి చెందిన 33 ఏళ్ల మానసగా గుర్తించారు. కారును మానస ఫ్రెండ్ వినోద్ అద్దెకు తెచ్చినట్టు తెలుస్తోంది. వినోద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కరీంనగర్లోని ఓ గదిలో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్ వచ్చాయని, నోట్లో నుంచి నురగలు వచ్చి ఆమె చనిపోయిందని చెప్పాడట. భయంతో కారులో మృతదేహాన్ని ఎల్కతుర్తి వద్ద తీసుకొచ్చి కారులో వదిలి వెళ్లిపోయానని చెప్పినట్టు తెలుస్తోంది.
అసలు ఫిట్స్ వస్తే.. స్థానిక ఆసుపత్రికి తరలించకుండా ఎల్కతుర్తికి తీసురావడం వెనుక కారణమేంటి? మృతదేహాన్ని కారు డిక్కీలో వేసేందుకు ఎవరెవరు సహకరించారు? ఈ క్రమంలో మానస గురించి డీటేల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు, మహిళ కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన విషయాలు నిర్ధరించుకునే పనిలో పడ్డారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: సీఎం రేవంత్రెడ్డికు కేంద్రం షాక్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ