Yadagirigutta Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి (ట్రస్ట్ బోర్డు) నియామకం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్టకు కూడా ప్రతిష్టాత్మక బోర్డును ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చైర్మన్, సభ్యుల జాబితా బయటకు రాగానే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కట్టలు తెగింది. ‘మా ఇలాఖా.. మా గుడి.. మరి బోర్డులో మా పేరేది?’ అంటూ స్థానిక ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త లొల్లికి తెరలేపాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నెర్ర
ఈ బోర్డు నియామకాలపై భువనగిరి ప్రాంత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉగ్రనరసింహుడిలా కన్నెర్ర చేశారు. యాదగిరిగుట్ట తన నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నప్పటికీ, బోర్డు ఏర్పాటు విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పదవి కాదు కదా, కనీసం బోర్డు మెంబర్లలో కూడా నల్లగొండ జిల్లాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. అసలు చైర్మన్ గిరి ఎవరికి, ఏ లెక్కన ఇచ్చారు? బోర్డు మెంబర్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఇదంతా ఎవరి ఇష్టప్రకారం నడిచింది? అంటూ రాజగోపాల్ రెడ్డి పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు.
కార్యకర్తలతో ‘మన్ కీ బాత్’
ఆశావహులు, స్థానిక నేతలు తన వద్దకు వచ్చి గొల్లుమనడంతో రాజగోపాల్ రెడ్డి వారిని సముదాయిస్తూనే, తన మనసులోని బాధను కార్యకర్తలతో పంచుకున్నారు. ‘ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నా అభిష్టం, అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? కనీసం సమాచారం ఇవ్వాలి కదా!’ అంటూ తన ‘మన్ కీ బాత్’ను వెళ్లగక్కారు. ఎక్కడెక్కడి వాళ్లకో బోర్డులో స్థానం కల్పించి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టడంపై స్థానిక క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు సేఫేనా? వరుస ప్రమాదాలపై ప్రజాందోళన!
పునరాలోచించాల్సిందే.. తగ్గేదే లే!
నల్లగొండ కాంగ్రెస్ ఖిల్లాలో ఈ బోర్డు లొల్లి కాస్తా ముదిరి పాకాన పడింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాకుండా, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై జిల్లా నేతలు అస్సలు తగ్గడం లేదు. యాదగిరిగుట్ట పాలకమండలి జాబితాపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, నల్లగొండ జిల్లాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తుండటంతో, ఈ లొల్లి అధిష్ఠానం వద్దకు చేరేలా కనిపిస్తోంది.