New Amrit Bharat Train: దూర ప్రయాణాలు చేసే ప్యాసింజర్స్ కు ఇండియన్ రైల్వే మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి జార్ఖండ్లోని ధన్బాద్ వరకు అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించబోతోంది. ఈ రైలు ప్రయాణం ఏకంగా ఏడు రాష్ట్రాల మీదుగా కొనసాగనుంది. దక్షిణ భారతం నుంచి తూర్పు భారతం వరకు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడనుంది. ఆగస్టు 25 నుంచి ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ తమిళనాడులో ప్రారంభమై జార్ఖండ్లోని ధన్బాద్కు చేరుకుంటుంది. మధ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తుంది. అంటే, ఒకే రైలు ద్వారా దక్షిణ, తూర్పు భారతాన్ని లింక్ చేయనుంది. వలస కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ఈ రైలు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించేందుకు పలు రైళ్లు మారాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికులు, చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులు ఒకే రైలు ద్వారా తమ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త రైలులో మొత్తం 22 కోచ్లు ఉంటాయి. అందులో 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. అదనంగా 2 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు, ఒక ప్యాంట్రీ కార్ ను ఏర్పాటు చేశారు. సుదూర ప్రయాణం కావడంతో ప్యాంట్రీ కార్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి కూడా ప్రయాణం సులభంగా ఉండే అవకాశం ఉంది.
ధన్బాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్లే రైలు నంబర్ 22363. ఈ రైలు ప్రతి శనివారం సాయంత్రం 4.10 గంటలకు ధన్బాద్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు నుంచి ధన్బాద్కు వెళ్లే రైలు నంబర్ 22364. ప్రతి మంగళవారం ఉదయం 7.50 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 1 గంటకు ధన్బాద్ చేరుకుంటుంది. కొత్త కోయంబత్తూరు-ధన్బాద్ సర్వీసు ఏడు రాష్ట్రాలను కలుపుతూ, దక్షిణం నుంచి తూర్పు భారతం వరకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు కొత్త సౌకర్యాన్ని అందించనుంది.
Read Also: అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!