Fastest and Slowest Vande Bharat Trains: భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్ ప్రెస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతో ఈ రైళ్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, అన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లు ఒకే వేగంతో నడవవు. ట్రాక్ పరిస్థితులు, మలుపులు, వంతెనలు, రద్దీ, స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక్కో రూట్ లో సగటు వేగం మారుతూ ఉంటుంది. కొన్ని మార్గాల్లో రైళ్లు 90 కిలోమీటర్లకు పైగా సగటు వేగంతో దూసుకెళ్తుంటే.. మరికొన్ని మార్గాల్లో 60-70 కిలోమీటర్ల సగటు వేగానికే పరిమితమవుతున్నాయి. ఇంతకీ దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యంత నెమ్మదిగా నడిచే వందే భారత్ రైళ్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సగటు వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఈ లిస్టులో ముందుంది. 771 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల్లో పూర్తి చేసే ఈ రైలు సగటున గంటకు 96.37 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలాపతి వందే భారత్ ఉంది. ఇది 700 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తూ గంటకు 95.89 కిలోమీటర్ల సగటు వేగాన్ని కలిగి ఉంది. చెన్నై-కోయంబత్తూరు రైలు గంటకు 90.36 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో సగటు వేగం 84.21 కిలోమీటర్లు కాగా, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా రూట్లో ఇది 84.85 కిలోమీటర్లుగా ఉంది.
కొన్ని వందే భారత్ రైళ్లు 75-82 కిలోమీటర్ల మధ్య సగటు వేగంతో నడుస్తున్నాయి. న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా సర్వీసు గంటకు 81.87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్-తిరుపతి రూట్లో సగటు వేగం 79.63 కిలోమీటర్లు. చెన్నై-మైసూరు వందే భారత్ 79.36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాగ్పూర్-బిలాస్పూర్ రూట్లో 77.92 కిలోమీటర్లు, హౌరా-న్యూ జల్పైగురి రూట్లో 76.84 కిలోమీటర్ల సగటు వేగం నమోదవుతుంది.
ఈ లిస్టులో ముంబై-షిర్డీ వందే భారత్ తక్కువ సగటు వేగంతో నడిచే వందేభారత్ గా గుర్తింపు తెచ్చుకుంది. 343 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలు సగటున గంటకు 65.96 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముంబై-సోలాపూర్ వందే భారత్ కూడా గంటకు 71.65 కిలోమీటర్ల సగటు వేగంతో నడుస్తోంది.
వందే భారత్ రైళ్ల గరిష్ఠ వేగ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవ ప్రయాణ వేగం పూర్తిగా రైలు సామర్థ్యంపై ఆధారపడదు. ట్రాక్ నాణ్యత, మలుపులు, వాలులు, సిగ్నలింగ్ వ్యవస్థ, రద్దీ లాంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మలుపులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండటంతో వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది. అందుకే కొన్ని రూట్లలో వందే భారత్ తన పూర్తి సామర్థ్యంతో ప్రయాణించలేకపోతోంది.
Read Also: అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!