భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని మరింత విస్తరిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మేకిన్ ఇండియాలో భాగంగా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే వందేభారత్, నమో భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా, వందేభారత్ స్లీపర్ రైళ్లకు కూడా త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. అటు హైడ్రోజన్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చేందుకు పరీక్షలు జరుపుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ లో బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముంబై- అహ్మదాబాద్ నడుమ బుల్లెట్ రైలు కారిడార్ ను నిర్మిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2030 వరకు ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉంది.
ముంబై- అహ్మదాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైలు మార్గాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్ర రెండు ప్రధాన బుల్లెట్ రైలు మార్గాలలో భాగం కాబోతోంది. హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కారిడార్లకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. రాబోయే మరికొద్ది సంవత్సరాల్లో లక్షలాది మంది ప్రయాణికులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి ప్రయాణ వేగంతో గమ్యస్థానాలకు చేరుకోనున్నారు.
తాజా ప్రతిపాదన ప్రకారం.. హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ రైలు మార్గం దాదాపు 760 కి.మీ పొడవు ఉంటుంది. దీని అంచనా వ్యయం రూ. 3.04 లక్షల కోట్లు. ఈ మార్గంలో రైలు గంటకు 350 కి.మీ. గరిష్ట వేగంతో నడుస్తుంది. ఏపీలో మొత్తం ఏడు జిల్లాల పరిధితో తొమ్మిది స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం విస్తరణలో 504 కి.మీ ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతంలోని మూడు కీలక ఆర్థిక ప్రాంతాలైన హైదరాబాద్ – విజయవాడ – చెన్నై నగరాలను కలుపుతుంది.
ఇక రెండవ రైలు మార్గం.. హైదరాబాద్ – బెంగళూరు మధ్య నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.2.38 లక్షల కోట్లు. మొత్తం 605 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ మార్గం ఆంధ్రలోని నాలుగు జిల్లాల గుండా వెళుతుంది. మొత్తం ఆరు స్టేషన్లను కలిగి ఉంటుంది. ఇందులో 263 కి.మీ.లు ఆంధ్రప్రదేశ్ లోపల ఉంటాయి. ఈ లింక్ హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు మధ్య ప్రయాణాన్ని సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
జపాన్ షింకన్సేన్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసే బుల్లెట్ రైళ్లను ఈ మార్గాల్లో నడిపించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఈ ప్రణాళికలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడం, నిర్మాణం, స్థానిక ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు కారిడార్ల మధ్య వ్యూహాత్మకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని అవకాశాలు, వేగవంతమైన అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దశాబ్ద కాలంలో ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉంది.
Read Also: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!