No AC In Cabs: మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు భగ్గున మండుతున్నాడు. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆయా పనుల కోసం బయటకు వెళ్లే వాళ్లు, ఆఫీస్ లకు వెళ్లేవాళ్లు ఇప్పటి వరకు క్యాబ్ లు బుక్ చేసుకుని వెళ్లే వాళ్లు. ప్రయాణ సమయంలో చక్కగా ఏసీ వేసే వాళ్లు. కానీ, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు ప్రయాణీకులకు షాక్ ఇస్తున్నారు. అసలే ఎండలు మండుతుంటే, ఏసీ వేయలేం అంటూ తేల్చి చెప్తున్నారు. ఒకవేళ ఏసీ వేయాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 24 నుంచి ‘నో ఏసీ క్యాంపెయిన్’
ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రైడ్స్ బాయ్ కాట్ చేసిన క్యాబ్ డ్రైవర్లు.. ఈ నెల 24 నుంచి ‘నో ఏసీ క్యాపెంయిన్’ మొదలుపెడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ కీలక ప్రకటన చేసింది. ఏసీతో నడిపించాలంటే అగ్రగేటర్ సంస్థలు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసకుంటున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ లోని ఓలా, రాపిడో, ఉబర్ అగ్రగేటర్ సంస్థలకు సంబంధంచి అన్ని క్యాబ్ లు ఈ క్యాంపెయిన్ లో పాల్గొననున్నట్లు ప్రకటించింది.
క్యాబ్ డ్రైవర్ల డిమాండ్ ఏంటి?
అగ్రిగేట్ సంస్థలు అందించే కమీషన్ చాలా తక్కువగా ఉంటుందని తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ వెల్లడించారు. తక్కువ కమీషన్ ను వ్యతిరేకిస్తూ ఈ క్యాపెంయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రీపెయిడ్ టాక్సీ ఛార్జీల మాదిరిగానే క్యాబ్ అగ్రిగేటర్లు యూనిఫామ్ ఛార్జీల విధానాన్ని అమలు చేయలని డిమాండ్ చేశారు. ఇంధన ఖర్చులు, మెయింటెనెన్స్, డ్రైవర్ సర్వీసులకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు. ఈ యాప్ లు క్యాబ్ లకు ఆటో రిక్షాల కంటే తక్కువ ధరలను వసూలు చేస్తున్నాయన్నారు. దీనివల్ల క్యాబ్లు నడుపుతున్న వారికి సంపాదన కష్టమవుతుందని ఆరోపించారు. ఆయా సంస్థలు తమ కమీషన్ ను పెంచే వరకు ఈ నిరసన కొనసాగుతుందని వెల్లడించారు. ప్రయాణీకులు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. తక్కువ కమీషన్ పై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణీకులు
క్యాబ్ డ్రైవర్ల నిర్ణయంపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీక్ అవర్స్ అంటూ తక్కువ దూరానికి ఎక్కువ ఛార్జీలు వసూళు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఏసీ కోసం అదనంగా ఛార్జీ చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఇలా నో ఏసీ క్యాంపెయిన్ చేపట్టిన సందర్భంగా ప్రయాణీకులు డ్రైవర్లతో వాగ్వాదాలకు దిగిన సందర్భాలున్నాయి. కమీషన్ తక్కువగా ఉంటే, వెంటనే క్యాబ్ సేవలను నిలిపివేసి, అగ్రగేటర్ సంస్థలతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. అంతేకానీ, క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాక ఏసీ వేయమని చెప్పడం మంచిది కాదంటున్నారు.
అగ్రిగేటర్ సంస్థలు ఏం అంటున్నాయంటే?
అటు ప్రయాణీకులే తమకు ముఖ్యమని, వారిని ఇబ్బంది పెడితే సహించేది లేదని అగ్రగేటర్ సంస్థలు తేల్చి చెప్పాయి. ఏసీ ఆన్ చేయకపోతే ట్రిప్ ఛార్జీల్లో కోత విధించడంతో పాటు అకౌంట్ ను బ్లాక్ చేస్తామని హెచ్చరించాయి. ఇన్సెంటివ్స్ కూడా అందవన్నాయి. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు మాత్రం కమీషన్ పెంచే వరకు తగ్గేదే లేదంటున్నారు.
Read Also: రూ.599కే ఫ్లైట్ జర్నీ, ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!