బడాబాబుల పిల్లలు లగ్జరీ కార్లతో రోడ్ల మీద చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. బాబులు బాగా సంపాదించడంతో కొత్త కొత్త కార్లను కొని రోడ్ల మీద దుమ్మురేపుతుంటారు. అయితే, బెంగళూరులో పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని చోట్ల లగ్జరీ కార్లకు ట్యాక్స్ చెల్లించి రోడ్ల మీద తిప్పితే, అక్కడ మాత్రం ట్యాక్స్ కట్టకుండగానే తిప్పేస్తున్నారు. తాజాగా ట్యాక్స్ ఎగ్గొడుతూ యథేచ్చగా బెంగళూరులో తిరుగుతున్న లగ్జరీ కార్లపై రవాణాశాఖ అధికారులు వేటు వేశారు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాహనాలను నడుపుతూ వేల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడంపై సీరియస్ అయ్యారు. ఫెరారీ, పోర్షే, BMW, ఆడి, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్ లాంటి కార్లను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.
పక్క రాష్ట్రంలో కొని.. బెంగళూరుకు తీసుకొచ్చి..
మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 47 ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రంలో ఒక ఏడాది కంటే ఎక్కువ ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచాలి అనుకుంటే, కారు యజమాని సదరు రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే, సదరు రవాణాశాఖకు ట్యాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ మార్క్ పొందాల్సి ఉంటుంది. అయితే.. బెంగళూరులోని చాలా మంది యువకులు, ధనవంతుల పిల్లలు మహారాష్ట్రలో కొనుగోలు చేసిన వాహనాలను తెచ్చి బెంగళూరులో నడుపుతున్నారు. ఎలాంటి ట్యాక్స్ లు చెల్లించకుండా బెంగళూరు రోడ్లపై రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. రీసెంట్ గా బెంగళూరు సిటీలో ఓ చోట యాక్సిడెంట్ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు లగ్జరీ కారు గత కొంతకాలంగా బెంగళూరులో అక్రమంగా తిప్పుతున్నట్లు రవాణా శాఖ అదికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిటీలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాల లగ్జరీ కార్లను పట్టుకుని సీజ్ చేశారు.
Karnataka RTO seized 30 luxury cars, including Ferrari, Porsche, BMW, Benz, and Audi, for evading tax on Sunday. Notices were issued to recover ₹3 crore in dues@tdkarnataka pic.twitter.com/ccvfWEDGbF
— ChristinMathewPhilip (@ChristinMP_) February 3, 2025
మొత్తం 30 లగ్జరీ కార్లు సీజ్
అనుమతి లేకుండా బెంగళూరులో తిరుగుతున్న లగ్జరీ కార్లను పరిశీలించి, వాటిలో 30 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ మల్లికార్జున్ టీమ్ బెంగుళూర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ లో పన్ను ఎగవేస్తున్న 30 లగ్జరీ కార్లును స్వాధీనం చేసుకున్నట్లు మల్లికార్జున్ తెలిపారు. ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్న కార్లలో ఫెరారీ, పోర్షే, BMW, ఆడి, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్ తో సహా 30 లగ్జరీ కార్లను సీజ్ చేసి బెంగళూరు రవాణాశాఖ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. ఈ కార్లపై ఏకంగా రూ.3 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ లో 41 మంది రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇకపై రాష్ట్రంలో ట్యాక్స్ కట్టకుండా నడిపే కార్లను జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు కచ్చితంగా రవాణాశాఖ నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
Read Also: అర్జెంట్ గా రైల్లో వెళ్లాలా? డోంట్ వర్రీ.. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!