Massive Aircraft in the Sea: గాల్లో ఉండాల్సిన విమానాలు.. సముద్రం అడుగున ఏం చేస్తున్నాయ్? కొంపదీసి అవి కనిపించకుండా పోయిన విమానాలా? గాల్లో ఎగురుతూ సాంకేతిక కారణాలతో సముద్రంలో కూలిపోయాయా? కానే కాదు.. ఆ విమానాలను ప్రభుత్వాలే స్వయంగా ముంచేశాయ్. అదేం పని? అయినా ఒక విమానాన్ని సముద్రంలో ముంచేయడం అంటే అంత తెలికైన పని కాదు కదా? అలా ఎందుకు చేస్తున్నారనేగా మీ సందేహం. ఇందుకు గల కారణాలేమిటో చదివేయండి మరి.
విమానాలను సముద్రంలో ముంచేయడం అనేది కాస్త హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా తరహాలో అనిపించినా.. అది నూటికి నూరుపాళ్లు నిజం. సాధారణంగా కాలం చెల్లిన విమానాలను ఏదైనా ఎయిర్ పోర్టు ఖాళీ స్థలాల్లో శిథిలమైపోయే వరకు వదిలేస్తారు. లేదా ముక్కలు చేసి పాత సామాన్లవాళ్లకు అమ్మేస్తారు. ఎవరికైనా హోటళ్లు పెట్టుకొనే ఇంట్రెస్ట్ ఉంటే.. వారికి తక్కువ ధరకు విక్రయించేస్తుంటారు. కానీ, కొన్ని దేశాలు మాత్రం అలా చేయడం లేదు. ఆ విమానాలను నేరుగా సముద్రంలో ముంచేస్తున్నాయ్. ఇదెక్కడి క్రేజీ ఐడియా. ఆ విమానాన్ని అమ్ముకున్నా, విడి భాగాలు వేలం వేసినా.. కోట్ల రూపాయలు వస్తాయి కదా అని అనుకుంటున్నారా? అయితే, ఇలా సముద్రంలో ముంచేసినా కూడా కోట్లు వచ్చేస్తున్నాయ్. అదెలా అనుకుంటున్నారా?
ముందుగా మనం టర్కీలోని ఏజియన్ సముద్రం అడుగున ఉన్న ఎయిర్ బస్ A300 గురించి తెలుసుకుందాం. దీన్ని 2016, జూన్ నెలలో టర్కీలోని రిసార్ట్లకు కేంద్రమైన కుషదాసి (Kusadasi) తీరంలో ఈ ప్యాసింజర్ జెట్ను ముంచేశారు. ఒకప్పుడు ఈ విమానాన్ని టర్కీలోని ఐదిన్ (Aydin) ప్రాంతీయ ప్రభుత్వం ఈ విమానాన్ని నడిపేది. అయితే, దానికి కాలం చెల్లడంతో ముక్కలు చేసి అమ్మేసుకుందాం అనుకుంది. అప్పుడే వారికి సముద్రంలో ముంచేయాలనే ఐడియా వచ్చింది.
ఈ విమానం పొడవు సుమారు 177 అడుగులు. రెక్కల వెడల్పు 144 అడుగులు. ఈ విమానం కోసం ప్రభుత్వం విమానయాన సంస్థకు సుమారు రూ.88 లక్షలు చెల్లించింది. అయితే, దాన్ని సముంద్రంలో ముంచడం పెద్ద సవాలుగా మారింది. విమానం దెబ్బతినకుండా జాగ్రత్తగా ఇన్ఫ్లేటబుల్ ఎయిర్ బెలూన్ల సహాయంతో విమానాన్ని నీటిపై తెలియాడేలా చూస్తూ పడవల ద్వారా సముద్రం మధ్యలోకి తీసుకెళ్లారు. సుమారు రెండున్నర గంటలు శ్రమించి.. స్కూబా డైవర్ల సహాయంతో నెమ్మదిగా సముద్రం అడుగున 75 అడుగల లోతులోకి దించారు. సముద్రం అడుగున ఉన్న ఈ విమానాన్ని చూసేందుకు ఏటా సుమారు 2.5 లక్షల మంది పర్యటకులు వస్తున్నట్లు టర్కీ చెబుతోంది. ఆ విమానాన్ని ఎలా చూడగలుతున్నారనేది చివరిలో తెలుసుకుందాం. దీని కంటే ముందు బహ్రెయిన్లో ముంచేసిన విమానం గురించి కూడా తెలుసుకుందా.
టర్కీ చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో బహ్రెయిన్ కూడా అదే పని చేసింది. 2019 జూన్లో ఏకంగా బోయింగ్ 747 (Boeing 747) విమానాన్నే సముద్రంలోకి ముంచేసింది. 70 మీటర్ల పొడవు ఉన్న ఈ జంబో జెట్ను బహ్రెయిన్ ఉత్తర తీరంలోని సముద్రంలో సుమారు 20 మీటర్ల లోతులో ముంచేశారు. చెప్పాలంటే టర్కీలో కంటే తక్కువ లోతులోనే దీన్ని ముంచారు. ఆ తర్వాత 2019 సెప్టెంబర్లో ‘డైవ్ బహ్రెయిన్’ అండర్ పార్క్ ఏర్పాటు చేసి.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్ వాటర్ థీమ్ పార్క్గా ఇది రికార్డు సృష్టించడం గమనార్హం.
కోట్లు విలువ చేసే విమానాలను సముద్రాల్లో ముంచేయడం ఏమిటీ పిచ్చి పని కాకపోతే అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.. గాల్లో ఎగిరే విమానాల కంటే.. సముద్రంలో మునిగి ఉన్న విమానాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. సముద్రంలో డైవింగ్ చేసుకుంటూ.. విమానాల్లో తిరుగుతున్న చేపలను, సముద్ర జీవులను, మొక్కలను చూస్తుంటే ఆ కిక్కే వేరు. సముద్రంలో చేపలు, ఇతర జీవులు పెరగడానికి గట్టి ఉపరితలాలు కావాలి. ఈ విమానాల క్యాబిన్లు, రెక్కలు నాచు, పగడాలు పెరగడానికి ఉపయోగపడతాయి. చిన్న చేపలకు ఇవి నీడనిస్తాయి. పిల్లలను పెట్టే స్థావరాలుగా మారతాయి. వీటిని చూసేందుకు వచ్చే పర్యటకులు, స్కూబా డైవింగ్ ద్వారా జీవిత కాలం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు చెప్పండి.. ఇది పిచ్చి పనా? తెలివైన పనా?
Also Read: మెజిస్టిక్.. కర్ణాటకలో తెలుగు సినిమాలు మాత్రమే ఆడే ఆ థియేటర్ను ఎందుకు కూల్చేశారు?
సాధారణంగా స్కూబా డైవింగ్ చేసేవారు సముద్రం అడుగున ఉండే చేపలు, పగడాలను చూస్తారు. కానీ, టర్కీ.. బహ్రెయిన్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేసేవారికి విమానాలను కూడా చూడవచ్చు. వాటి లోపలికి వెళ్లి.. ఈత కొడుతూ సరికొత్త అనుభూతి పొందవచ్చు. ఇప్పుడు స్కూబా డైవింగ్ ప్రేమికులకు ఈ ప్రాంతాలే ఫస్ట్ ఛాయిస్. మీకు కూడా ఆసక్తి ఉంటే.. వెళ్లండి.