Maharashtra Tragedy: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్త ఫోన్ కోసం తండ్రి, కొడుకు మధ్య తలెత్తిన వివాదం.. ముగ్గురు ప్రాణాలను బలికొంది. వాలుజ్ ఎంఐడీసీ(Waluj MIDC) పరిధిలోని తిస్గావ్ గుట్ట (Tisgaon)పై నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకి ప్రాణాలు విడిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్టా ఫాటా (Zalta Phata) ప్రాంతానికి చెందిన మురళీధర్ చాంద్గుడే (48), సంగీత దంపతులకు 19 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నాడు. కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన కునాల్ ఆవేశంగా తిస్గావ్ గుట్టపైకి వెళ్లాడు. అటు తల్లిదండ్రులు సైతం కుమారుడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చేందుకు గుట్ట పైకి ఎక్కారు.
అయితే గుట్టపైకి వెళ్లగానే కునాల్ కిందికి దూకేస్తానని తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించాడు. కొండ అంచున ప్రమాకరంగా నిలబడి పేరెంట్స్ తో వాగ్వాదానికి దిగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గుట్ట కింద రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే కునాల్ రక్షణ వలయం ఉన్న ప్రాంతం నుంచి దూరంగా జరుగుతూ.. చానిపోతానని మరింత బెదిరించాడు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..
అలా సమయం గడిచేకొద్ది పరిస్థితి మరింత విషమించింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కొడుకును దగ్గరకి తీసుకునేందుకు తండ్రి మురళీధర్ ముందుకు వెళ్లగా.. కునాల్ ఒక్కసారిగా కొండపై నుంచి కిందికి దూకేశాడు. అతడ్ని పట్టుకునేందుకు వేగంగా ముందుకు కదిలి మురళీధర్ సైతం నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఇద్దరూ అమాంతం పైనుంచి కిందకి పడిపోయారు. భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం చూసి సంగీత సైతం మనో వేదనతో పై నుంచి కిందికి దూకేసింది. దీంతో శరీరాలు పడ్డ ప్రాంతానికి పోలీసులు చేరుకొని.. మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!