హైదరాబాద్ మెట్రో రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఇందులో ఫేజ్ II-Bకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్(HAML), కేంద్ర ప్రభుత్వంతో 50:50 జాయింట్ వెంచర్ గా ₹19,579 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫేజ్ ను చేపట్టనుంది. 86.1 కి.మీ. పొడవైన మూడు కారిడార్లు ఉండే ఫేజ్ II-B ని ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫేజ్ II-Bలో మూడు కారిడార్లు
హైదరాబాద్ మెట్రో ఫేజ్ II-Bకి సంబంధించి మూడు కారిడార్లు నిర్మించనున్నారు. మొత్తం 86.1 కిలో మీటర్ల పొడవు ఉంటుంది.
1.కారిడార్ IX కింద రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఫ్యూచర్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కి.మీ. వరకు ఉంటుంది.
2.కారిడార్ Xలో JBS నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ నిర్మిస్తారు.
3.కారిడార్ XIలో JBS నుంచి షామీర్ పేట్ వరకు 22 కి.మీ ఉంటుంది.
నిధుల్లో ఎవరి వాటా ఎంత అంటే?
హైదరాబాద్ మెట్రో ఫేజ్ II-Bకి సంబంధించి పూర్తి ₹19,579 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వ వాటా ₹5,874 కోట్లు (30%), కేంద్రం ₹3,254 కోట్లు (18%), JICA, ADB, NDB మొదలైన వాటి నుంచి రుణం కింద ₹9,398 కోట్లు (48%), PPP – పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య భాగం ₹783 కోట్లు (4%) యాడ్ కానున్నాయి. తదుపరి చర్యలు తీసుకోవాలని HAML ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో 76.4 కి.మీ.ల ఐదు కారిడార్లను కవర్ చేసే HMR ఫేజ్ II-A ను ₹24,269 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం గతంలో ఆమోదించింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) కు పంపింది. ఎందుకంటే.. ఇది కూడా కేంద్రంతో జాయింట్ వెంచర్గా ప్రతిపాదించబడింది.
Read Also: ఆహా.. ఆ దేశంలో అందరికీ ఫ్రీ జర్నీ.. బస్సుల్లోనే కాదు, రైళ్లలో కూడా!
హైద్రాబాద్ మెట్రో ఫేజ్ 1కు ₹22,000 కోట్లు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్య స్థాయిలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. 69.2 కి.మీ పరిధిలో మూడు కారిడార్లను కవర్ చేసే HMR ఫేజ్ I ను ₹22,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించింది. ఇది PPP మోడ్లో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్ కావడం విశేషం. అటు పాత బస్తీలోనూ మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 7.5 కిలో మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసం ₹125 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతిపాదిత ఫేజ్-II మెట్రో రైలు లైన్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా బస్ స్టేషన్ (MGBS) నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రోను నిర్మించనున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో పనుల కోసం ₹500 కోట్లు కేటాయించారు. దాదాపు 311 ప్రదేశాల్లో ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సేకరించారు. ఈ స్ట్రెచ్ లోని యజమానులకు పరిహారంగా ₹283 కోట్లు పంపిణీ చేశారు.
Read Also: ఇక స్లీపర్ కోచ్ లోనూ ఏసీ బోగి సదుపాయాలు.. రైల్వే గ్రీన్ సిగ్నల్!