Iran-Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయగా, ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. కతార్, ఇరాక్ లోని అమెరికా బేస్ లపై క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ఇరాన్ మీద దాడులు చేస్తామని హెచ్చరించాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్చంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు విమానాలను రద్దు చేయడంతో పాటు మరికొన్ని విమానాలను దారి మళ్లించాయి.
ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు
దోహా లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి తర్వాత భారత్-ఖతార్ మధ్య 2 విమానాలు రద్దు అయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాయి. భారత్ నుంచి ఖతార్కు వెళ్లే రెండు విమానాలు ఇండిగో, ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇండిగో విమానం ఢిల్లీ నుండి ఖతార్ ప్రయాణించాల్సి ఉండగా, ఎయిర్ ఇండియా విమానం కొచ్చి నుంచి ఖతార్ బయలుదేరాల్సి ఉంది.
విమాన కార్యకలాపాలకు ఆటంకం
మధ్యప్రాచ్యంలో వైమానిక ప్రాంతం మూసివేసిన నేపథ్యంలో గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి విమాన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకునే ముందు వారి విమానాల స్టేటస్ కు సంబంధించి విమానయాన సంస్థలతో చెక్ చేసుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచించారు. విమానాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందే ప్రయత్నం చేయాలని చెప్పారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ తో పాటు వాటి పరిసర దేశాలకు వెళ్లే విమానాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.
Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!
ప్రయాణీకులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ
అటు మిడిల్ ఈస్ట్ లో పరిస్థితుల దృష్ట్యా ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. తమ సంస్థకు చెందిన విమానాలలో కొన్ని ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. విమానయాన కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎలాంటి ఉద్రిక్తతలు లేని గగనతలం మీదుగా రాకపోకలు కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఒకవేళ ఏదైనా విమానం అనుకున్న సమయానికి బయల్దేరకపోతే, లేదంటే రద్దు చేస్తే, తమ అధికారిక వెబ్ సైట్ లో వివరాలను పొందుపరుస్తామని తెలిపింది. విమానయాన అధికారుల సమన్వయంతో తమ విమానాల రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ప్రయాణీకుల భద్రతే తమకు ముఖ్యమని ఇండిగో వివరించింది.
Read Also: బుల్లెట్ రైలు కారిడార్ లో మరో మైల్ స్టోన్, కీలక వంతెన పూర్తి!