Festival Season Special Trains: దేశంలో దీపావళి, ఛత్ పూజ పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో ఎక్కడ ఉన్నా, ఈ పండుగలు జరపుకునేందుకు చాలా మంది తమ సొంతూళ్లకు చేరుకుంటారు. ఎక్కువగా రైళ్ల ద్వారానే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఈసారి గతంతో పోల్చితే దీపావళి, ఛత్ పూజ వేళ పెద్ద సంఖ్యలో ప్రజలు రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపారు. అధిక సంఖ్యలో ప్రయాణీకులు రావడంతో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గతేడాదితో పోల్చితే ఏకంగా 65 శాతం పెంచింది. అక్టోబర్ 1 నుంచి మొదలు కొని నవంబర్ 30 వరకు కంగా 7,296 ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసింది. రద్దీని తగ్గించేందుకు అవసరం అయితే, మరికొన్ని రైళ్లు నడిపించేందుకు నిర్ణయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో కేవలం 4,429 ప్రత్యేక రైళ్లు నడిపించింది.
అక్టోబర్ చివరి నాటికి 3,164 ప్రత్యేక రైళ్లు
నవంబర్ 4న భారతీయ రైల్వే సంస్థ 12 మిలియన్ల మంది అన్ రిజర్వ్డ్ నాన్ సబర్బన్ ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు తరలించింది. దీపావళి సందర్భంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంది. అక్టోబరు చివరి నాటికి, అధికారులు 3,164 ప్రత్యేక రైళ్లను నడిపారు. పండుగ రద్దీలో ఎక్కువ భాగం వలస కార్మికులే ఉన్నారు. దేశ నలుమూల్లలో పని చేస్తున్న లక్షలాది మంది పండుగకు సొంత ఊళ్లకు వెళ్లడంతో రద్దీ విపరీతంగా పెరిగింది.
పండుగ రద్దీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న రైల్వే మంత్రి
పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ, తీసుకుంటున్న చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. “ప్రజలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడమే మా లక్ష్యం. గత ఏడాది పండుగ సందర్భంగా సుమారు 4 వేల ప్రత్యేక రైళ్లు నడిపించాం. కానీ, ఈ సంవత్సరం సుమారు 7,750 రైళ్లను ఏర్పాటు చేశాం” అని సతీష్ కుమార్ తెలిపారు.
రైలు సర్వీసులకు ఎక్కువ డిమాండ్
పండుగల సమయంలో విమాన టిక్కెట్ల ధర చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో రైలు సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. గత కొద్ది సంవత్సరాలుగా పండుగల సందర్భంగా దేశీయ విమానాల ధరలు 15-30 శాతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. రైల్వే శాఖ సైతం పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి, ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నది.
ముంబై రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట
పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ముంబైలోని బాంద్రా టెర్మినల్ లో తొక్కిసలాట జరిగింది. అక్టోబర్ 27న జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రమాణీకులు గాయపడ్డారు. బాంద్రా-గోరఖ్ పూర్ అంత్యోదయ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణీకులు ఎక్కేందుకు ఒక్కసారిగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
Read Also: దేశంలో రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. కారణాలు ఏంటో తెలుసా?