Indian Railways: లక్నో-కాన్ఫూర్ రైల్వే మార్గంలో 26 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 6 వారాల పాటు వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్కువగా రోజువారీ ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 6 వారాల పాటు ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు. గంగా నదిపై రైల్వే వంతెన పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా ప్రతాప్ గఢ్- కాన్పూర్, లక్నో- ఝాన్సీ, ప్రయాగ్ రాజ్ సంగం- కాన్పూర్ అన్వర్ గంజ్, సీతాపూర్ సిటీ- కాన్పూర్, రాయ్ బరేలి- కాన్పూర్, బాలమౌ- కాన్పూర్, లక్నో నుండి కాస్గంజ్ వయా కాన్పూర్ మార్గాల్లో మార్చి 19 నుంచి మే 1 మధ్య ప్యాసింజర్ రైళ్లు నడవవని రైల్వే అధికారులు తెలిపారు. అటు సూరత్- నకాహా, నకాహా- చల్తాన్, గాంధీధామ్- భాగల్పూర్, అహ్మదాబాద్- దర్భంగా, చాప్రా- ఆనంద్ విహార్ వయా కాన్పూర్ మధ్య ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఎక్స్ ప్రెస్ రైళ్లకు మినహాయింపు
అటు ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్వల్పకాలిక రద్దు ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. పూణే నుండి లక్నోకు వెళ్లే లక్నో జెఎన్ ఎక్స్ ప్రెస్ (11407) కాన్పూర్ సెంట్రల్ వరకు ప్రయాణించనుంది. అదే రైలు(11408) తిరుగు ప్రయాణంలో కాన్పూర్ సెంట్రల్ నుంచి పూణేకు ప్రయాణం కొనసాగిస్తుంది. ముంబై నుంచి లక్నో మధ్య రాకపోకలు కొనసాగించే లక్నో AC SF ఎక్స్ ప్రెస్ (22121) కూడా కాన్పూర్ సెంట్రల్ వరకే ప్రయాణిస్తుంది. అటు తిరుగు ప్రయాణంలో ఈ రైలు (22122) కాన్పూర్ సెంట్రల్ నుంచి ముంబైకి వెళ్తుంది. కాన్పూర్- ఖాత్గోడం గరీబ్ రథ్(12209/12210) లక్నో నుంచి రాకపోకలు కొనసాగించనుంది. చప్రా-ఫరూఖాబాద్ మధ్య నడిచే ఉత్సర్గ్ ఎక్స్ ప్రెస్(15083/15084) గోమతినగర్ రైల్వే స్టేషన్ నుండి నడుస్తుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ ట్యూబ్, వేగం ఎంతో తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
6 రైళ్లు రీ షెడ్యూల్, 52 రైళ్లు దారిమళ్లింపు
ఈ రైల్వే వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో మొత్తం 6 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. మరో 52 రైళ్లను ఈ కాలానికి దారి మళ్లించారు. ఈ మేరకు రైల్వే అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ మార్గంలో రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు కొద్ది రోజుల పాటు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులకు ప్రస్తుతం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ, మున్ముందు మరింత మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణీకులకు కలిగిన అంతరాయానికి చింతిస్దున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితమే ఈ రైల్వే వంతెన పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం కీలకమైన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలను నిలిపివేస్తూ నిర్ణయించారు.
Read Also: ఇక పార్శిల్ సర్వీసులూ మొదలుపెట్టనున్న మెట్రో.. ఎప్పుడు, ఎక్కడ ఎలాగంటే?