Indian Railways: భారతీయ రైల్వేలోని పలు రైళ్లలో ఉచితంగా భోజనం అందిస్తారు. ఇందుకోసం టికెట్ కొనుగోలు సమయంలోనే భోజనానికి డబ్బులు తీసుకుంటారు. లేదంటే, ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి కాంప్లిమెంటరీగా ఉచిత భోజనం అందిస్తారు. ఒకవేళ రైలు ప్రయాణంలో ఆహారం కావాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ ఏసీ, స్లీపర్ క్లాసు ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనరల్ కోచ్ లలో ప్రయాణించే వాళ్లు తక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. సాధారణంగా రైళ్లు ప్యాంట్రీ సేవల ద్వారా ఆహారాన్ని అందిస్తాయి. లేదంటే, ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ, ప్రయాణీకులందరికీ ఉచితంగా ఫుడ్ అందించే ఓ ప్రత్యేక రైలు ఉంది. ఇంతకీ దాని పేరు ఏంటి? ఏ రూట్ లో నడుస్తుందో తెలుసా?
ఉచితంగా ఆహారం అందించే ఏకైక రైలు
తన ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే ఏకైక రైలు సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్(రైలు నెంబర్ 12715). ఈ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఫుడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే, ఈ రైల్లో ప్రయాణించే వారందరికీ ఫ్రీగా ఫుడ్ అందిస్తారు. చాలా సంవత్సరాలుగా ఈ రైలులో ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రయాణీకులకు భోజనం వడ్డిస్తున్నారు. ఈ రైలు తన ప్రయాణంలో మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో ఆరు స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. ప్రయాణీకులు ఆహారాన్ని తినేందుకు వీలుగా రైలు తగినంత సేపు ఆగుతుంది.
అమృత్ సర్- నాందేడ్ మధ్య ప్రయాణం
సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్ పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు రెండు ముఖ్యమైన సిక్కు మత ప్రదేశాలను కలుపుతుంది. అమృత్ సర్ లోని శ్రీ హర్మందిర్ సాహిబ్, నాందేడ్ లోని శ్రీ హజుర్ సాహిబ్ హరిద్వారాలను లింక్ చేస్తుంది. ఈ ప్రయాణం 2,081 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రయాణ సమయంలో ఆరు స్టేషన్లలో ఉచితంగా భోజనం అందిస్తారు. రైలులో ప్యాంట్రీ ఉన్నప్పటికీ, ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్ ప్రతి ఒక్క ప్రయాణీకుడికి భోజనం అందిస్తారు.
Read Also: ఆ రూట్లో వెళ్లే 70 రైళ్లు రద్దు.. ముందుగా చెక్ చేసుకోండి!
మూడు దశాబ్దాలుగా ఉచిత భోజనం
గత మూడు దశాబ్దాలుగా ఈ రైలు తన ప్రయాణీకులకు ఉచితంగా భోజనం అందిస్తున్నది. ఏసీ, స్లీపర్ క్లాసులతో పాటు జనరల్ కోచ్ లో ప్రయాణించే వారికి కూడా తిన్నంత భోజనం అందిస్తారు. కధీ- చావల్, పప్పు, కూరగాయలతో కూడిన భోజనాన్ని అందిస్తారు. ప్రతిరోజూ సుమారు 2,000 మందికి ఉచిత ఆహారం అందిస్తారు. ఈ సంప్రదాయం 1995లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉచిత ఆహారం అందిస్తున్నారు. దేశంలో ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే రైలుగా సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: రైల్లో మీ వస్తువులు పోయాయా? సింపుల్ గా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు!