Indian Bullet Train: దేశంలో తొలి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు అయిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 508 కిలో మీటర్ల పొడవైన ఈ కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను లింక్ చేస్తుంది. దాద్రా, నాగర్ హవేలీ గుండా వెళ్లే ఈ బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం 12 స్టేషన్లు నిర్మింనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఇప్పటికే ఇండియన్ బుల్లెట్ రైలుకు సంబంధించిన ట్రయల్స్ జపాన్ లో ప్రారంభమయ్యాయి. 2026 నాటికి దేశంలో టెస్ట్ రన్ నిర్వహించబోతోంది.
బుల్లెట్ ట్రైన్ ఏ స్టేషన్ల గుండా వెళుతుందంటే?
1.ముంబై (బాంద్రా కుర్లా కాంప్లెక్స్): ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ లో ఇది ప్రారంభ స్టేషన్.
2.థానే: థానేలోని స్టేషన్ డోంబివ్లి తూర్పు సమీపంలో నిర్మించనున్నారు.
3.విరార్: ఇది పాల్ఘర్ జిల్లాలో ఉంటుంది. మహారాష్ట్రలోని మూడవ స్టేషన్ కానుంది.
4.బోయిసర్: బోయిసర్ స్టేషన్ సమీపంలోని ఈ స్టేషన్ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతుంది.
5.వాపి: గుజరాత్ లోని మొదటి స్టేషన్ ఇది.
6.బిలిమోరా: నవ్సరి జిల్లాలో ఉన్న ఈ స్టేషన్ ప్రాంతీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.
7.సూరత్: గుజరాత్లోని ఒక ప్రధాన వాణిజ్య నగరం అయిన సూరత్.. బుల్లెట్ రైలుకు కీలకమైన స్టాప్ లలో ఒకటిగా ఉంటుంది.
8.భరూచ్: నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ పారిశ్రామిక అభివృద్ధికి సహకారం అందించనుంది.
9.వడోదర: గుజరాత్ సాంస్కృతిక, విద్యా కేంద్రంగా పిలువబడే ఈ స్టేషన్ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది.
10.ఆనంద్/నడియాద్: ఖేడా జిల్లాలో ఉన్న ఈ స్టేషన్ వ్యవసాయ, పాడి పరిశ్రమలకు సేవలు అందిస్తుంది.
11.అహ్మదాబాద్: గుజరాత్ ఆర్థిక రాజధానిగా తరచుగా పిలువబడే బుల్లెట్ రైలు స్టేషన్ కలుపూర్ సమీపంలో ఉంటుంది.
12.సబర్మతి: బుల్లెట్ రైలు కారిడార్ చివరి స్టేషన్ కానుంది. ఇది అహ్మదాబాద్ మెట్రోతో అనుసంధానించబడుతుంది.
Read Also: 60 సెకెన్లలో కన్ఫర్మ్ టికెట్ బుకింగ్, సింఫుల్ గా ఇలా చేయండి!
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి..
⦿ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు (MAHSR) కారిడార్ సుమారు 508 కి.మీ. విస్తరించి ఉంది.
⦿ ఈ కారిడార్ ముంబై (BKC), థానే, విరార్, మహారాష్ట్రలోని బోయిసర్ వంటి ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్తుంది.
⦿ గుజరాత్లో ఈ కారిడార్ వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిని కలుపుతూ వెళ్తుంది.
⦿ ఈ కారిడార్ రెండు విభాగాలుగా విభజించబడింది, గుజరాత్ విభాగం 348 కి.మీ ఉండగా మహారాష్ట్ర విభాగంలో 156 కి.మీ. విస్తరించి ఉంది. 21 కి.మీ భూగర్భంలో ఉంటుంది. 7 కి.మీ సముద్ర గర్భంలో కొనసాగుతుంది. 5 కి.మీ పర్వతాల్లో సొరంగం ద్వారా కొనసాగుతుంది.
దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు స్టేషన్ దాదాపు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. వచ్చే ఏడాది ట్రయల్ రన్ ప్రారంభం అవుతుందన్నారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సూరత్ సమీపంలో 300 కి.మీ. వయాడక్ట్ పని కొనసాగుతున్నట్లు తెలిపారు.
Read Also: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!