Indian Railways Special Trains: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు రైల్వే అధికారులు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక రైలు సేవలను సెప్టెంబర్ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం (08547/08548), విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం (08579/08580) ప్రత్యేక రైళ్లను ప్రయాణీకుల సౌలభ్యం కోసం పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రత్యేక రైళ్ల పొడిగింపు ఎప్పటి వరకు అంటే?
⦿ విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు
విశాఖపట్నం – తిరుపతి వీక్లీ స్పెషల్(రైలు నంబర్ 08547) రైలు సేవలను ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 24 వరకు (సుమారు ఎనిమిది ట్రిప్పులు) పొడిగించారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి – విశాఖపట్నం (08548) వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను ఆగస్టు 7 నుండి సెప్టెంబర్ 25 వరకు ఎనిమిది ట్రిప్పులకు పొడిగిస్తారు. ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
⦿ విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ స్పెషల్ రైలు
విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ స్పెషల్ (08579) వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను కూడా పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకు (మొత్తం తొమ్మిది ట్రిప్పులు) నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, చర్లపల్లి-విశాఖపట్నం (08580) వీక్లీ స్పెషల్ రైలు ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 27 వరకు (తొమ్మిది ట్రిప్పులు) నడపనున్నారు. ఈ రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్దీప్ వెల్లడించారు.
Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!
ప్రత్యేక రైలు సేవలు వినియోగించుకోవాలన్న అధికారులు
పండుగ రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నట్లు కె. సాన్దీప్ తెలిపారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను స్థానిక రైల్వే స్టేషన్లతో పాటు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లోనూ చూసుకోవచ్చన్నారు. ప్రయాణీకులు ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసేందుకు ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్ లోనే!