Namo Green Rail Approved: భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యావరణహిత, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ రైల్వే మార్గంలో నడవనుంది. బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఇది ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఈ ప్రాజెక్ట్ తో హైడ్రోజన్ ఆధారిత రైల్వే టెక్నాలజీ కలిగిన జర్మనీ, జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన భారత్ కూడా చేరింది.
ఈ రైలులో మొత్తం పది కోచ్లు ఉంటాయి. ఇందులో రెండు పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్లు ఉంటాయి. ఈ రైలు 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ తో పనిచేస్తుంది. రెండు పవర్ కార్లు కలిసి మొత్తం 2,400 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. సాధారణ ప్రయాణ సమయంలో ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అయితే, ట్రయల్ రన్లలో గంటకు 120 కిలోమీటర్ల వరకు వేగాన్ని పరీక్షించారు. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే ఈ రైలు దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో హైడ్రోజన్ తో కెమికల్ రియాక్షన్ జరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, కొంత వేడి మాత్రమే బయటకు వస్తాయి. అంటే, డీజిల్ ఇంజిన్ల మాదిరిగా ఎలాంటి హానికరమైన పొగ, కాలుష్యం విడుదల కాదు. అందుకే దీనిని పూర్తిగా పర్యావరణహిత సాంకేతికతగా భావిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే, ఈ రైలు ప్రయాణిస్తున్నప్పుడే తనకు కావాల్సిన విద్యుత్ ను తానే ఉత్పత్తి చేసుకుంటుంది.
హైడ్రోజన్ స్టోరేజ్ విషయంలో భారతీయ రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రైలు ముందు భాగంలో 27 హైడ్రోజన్ సిలిండర్లు, వెనుక భాగంలో మరో 27 సిలిండర్లను ఏర్పాటు చేశారు. జింద్ లో ప్రత్యేకంగా హైడ్రోజన్ స్టోరేజ్, ఇంధనం నింపే కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రంలో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ సెన్సార్లు, భద్రతా పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్టాండ్ బై వ్యవస్థలను కూడా సిద్ధం చేశారు.
ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా భారత్ లోనే రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. లక్నోలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ రైలు రూపకల్పన చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీనిని తయారు చేసింది.
జింద్-సోనిపట్ రూట్ లోనే ఎందుకు?
భారతీయ రైల్వే ఇప్పటికే తన నెట్ వర్క్ లో ఎక్కువ భాగానికి పవర్ సప్లై ఇచ్చింది. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కష్టంగా ఉంటుంది. అలాంటి మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ఈ సాంకేతికత భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Read Also: కాశీ నుంచి జగన్నాథ్ వరకు.. 11 రోజుల్లో ‘డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్’కు మీరు రెడీనా?