భారతీయ రైల్వే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గూడ్స్ కమ్ ప్యాసింజర్ డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఈ వినూత్న ఆలోచనకు రీసెంట్ గా ప్రధాని మోడీ ఆమోదం తెలపడంతో.. కార్యరూపం దాల్చనున్నాయి.
సరికొత్తగా డబుల్ డెక్కర్ రైళ్లు..
ఇప్పటి వరకు భారతీయ రైల్వే సంస్థ డబుల్ డెక్కర్ రైళ్లను నడిపింది. వీటిలో కేవలం ప్రయాణీకులు వెళ్లేవారు. ఇకపై రూపొందే రైళ్లు డబుల్ డెక్కర్ రైళ్లు ఒకేసారి ప్రయాణీకులతో పాటు సరుకులను రవాణా చేయనున్నాయి. “డబుల్ డెక్కర్ రైళ్లు సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. ప్రయాణీకులను పై డెక్ లో కూర్చోబెడతారు. సరుకును గ్రౌండ్ ఫ్లోర్ లో రవాణా చస్తారు. ఇప్పటికే ఈ డిజైన్ కు ఆమోదం లభించింది. కోచ్ ల తయారీకి సంబంధించిన ప్రణాళికలు కొనసాగుతున్నాయి” అని రైల్వే అధికారులు వెల్లడించారు.
గత నెలలో ప్రధాని ముందుకు ప్రతిపాదనలు
2024 చివరిలో రైల్వే మీద సమీక్ష సందర్భంగా ఈ ప్రణాళికను రైల్వే అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుంచారు. ఈ ఆలోచనకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రైల్వేలకు గణనీయమైన ఆదాయం పొందే అవకాశం లభించనుంది. రోడ్డు రవాణాకు పోటీగా రైల్వేల ద్వారా గూడ్స్ ను రవాణా చేసే అవకాశం ఉంటుంది. “ప్రస్తుతం రోడ్డు రవాణాపై ఆధారపడిన పార్శిళ్లు, ఇ-కామర్స్ షిప్మెంట్ల కొనసాగుతున్నాయి. ఇకపై రైల్వేల ద్వారా వీటిని పంపే అవకాశం ఉంటుంది” అని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
3 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం
ప్రస్తుతం రైల్వేలు రవాణా చేసే సరుకులో బొగ్గు, ఇనుప ఖనిజం 60 శాతం వాటాను కలిగి ఉంది. 2030 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది. పార్శిల్ షిప్ మెంట్లతో సహా ఇతర వస్తువుల రవాణా చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24లో ఇతర వస్తువుల రవాణా ఆదాయ లక్ష్యాన్ని రూ.13,227 కోట్లకు సవరించింది.
ఒక్కో డబుల్ డెక్కర్ కోచ్ ఖర్చు రూ. 4 కోట్లు
కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లకు సంబంధించిన ప్రోటో టైప్ ను డెవలప్ చేస్తున్నారు. సరుకు రవాణాతో పాటు ప్రయాణీకులు వెళ్లేలా నిర్మించే ఒక్కో కోచ్ ధర రూ. 4 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. “ఇప్పటి వరకు 10 కోచ్లను నిర్మించింది. పూర్తి రేక్ ను సమీకరించడం జరుగుతోంది. ఈ కోచ్ లు భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకబోతున్నాయి” అని రైల్వే అధికారులు తెలిపారు.
2023-24లో పెరిగిన సరుకు రవాణా
2023-24లో భారతీయ రైల్వే సంస్థ సుమారు 1,591 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 5 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2030 నాటికి 10 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించాలని రైల్వే సంస్థ అంచనా వేస్తున్నది.
Read Also:వందేభారత్ స్లీపర్ ట్రయల్ రన్ పూర్తి, ఫస్ట్ ఏ రూట్లో అందుబాటులోకి వస్తుందంటే?