Sprite Tejas Express: రైల్వే శాఖ సరికొత్త ఆదాయ మార్గాలన్వేషణలో భాగంగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇండియన్ రైల్వే పేరుతో కాకుండా దేశంలోనే తొలిసారిగా ఒక వ్యాపార సంస్థ పేరుతో రైలును నడపబోతోంది. ఇందులో భాగంగా లక్నో-ఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్ప్రెస్ రైలును.. త్వరలోనే ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్’ (Sprite Tejas Express)గా మార్చబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. ‘స్ప్రైట్’ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఈ తేజస్ రైలుపై 6 నెలల పాటు ప్రకటనల హక్కులు కట్టబెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా 82501, 82502 నెంబర్లు కలిగి ఉన్న తేజస్ ఎక్స్ప్రెస్.. ఆగస్టు 19 నుంచి నవంబర్ 11 వరకు స్ప్రైట్ బ్రాండింగ్తో ప్రయాణికులకు సేవలు అందించనుంది.
సాధారణంగా భారతీయ రైల్వే.. స్టేషన్లలో షాపులు, రైలు భోగీలపై ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటుంది. అయితే ఈసారి కొత్తగా ఒక రైలు పేరునే బ్రాండ్ పేరుతో మార్చడం ఇదే తొలిసారి. టికెట్ ధరలను పెంచకుండా, ప్రయాణికులపై ఎలాంటి భారం వేయకుండా రైల్వే శాఖకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఒక బ్రాండ్ పేరును రైలుకు పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి. లక్నో-ఢిల్లీ తేజస్.. ప్రైవేట్ తరహా రైలు అయినప్పటికీ ట్రాక్లు, స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను వాడుకుంటున్నందుకు గానూ రైల్వే శాఖకు హాలింగ్ ఛార్జీలు చెల్లిస్తోంది’ అని వివరించారు.
Also Read: హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ రైలు.. పరిశీలనలో 18 స్టేషన్లు.. ఇందులో మీ ఊరు ఉందా?
దేశంలోని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సూపర్ ఫాస్ట్ రైళ్లలో తేజస్ ఎక్స్ప్రెస్ ఒకటి. ప్రయాణికుల కోసం ఇందులో రుచికరమైన ఆహారం, పానీయాలతో పాటు ప్రయాణం బోర్ కొట్టకుండా ఆన్బోర్డ్ ఎంటర్టైన్మెంట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పెళ్లిళ్లు, కార్పొరేట్ మీటింగ్స్, ఇతర వేడుకల కోసం ఒక గ్రూప్ గా ప్రయాణించేందుకు ఇందులో వీలుంది. ప్రయాణికులు కావాలనుకుంటే ఒకేసారి పూర్తి ఏసీ కోచ్ను బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ లక్నో-ఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. 2021 డిసెంబర్ 3న ప్రారంభించారు.
Also Read: స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!