South Central Railway Special Trains: ఇండిగో విమానాల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ విమానాశ్రయంలోనూ గత నాలుగు రోజులు ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. విమానాలకు బదులుగా బస్సులు, రైళ్లలో ప్రయాణాలు కొనసాగేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లకు, బస్సులకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ముంబై, కలకత్తా, చెన్నైకి 3 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లకు సంబంధించి నిన్న రాత్రి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఉదయం వరకు 25 శాతం బుక్సింగ్ పూర్తి అయ్యాయి. ప్రయాణీకులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది.
విమానాల రద్దు నేపథ్యంలో అదనపు రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. “ఫ్లైట్ల రద్దుతో బస్సులు, రైళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. హైదరాబాద్ నుంచి ముంబై, కోల్కతా, చెన్నైకి మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. నిన్న రాత్రి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఉదయానికి 25% బుకింగ్స్ పూర్తి అయ్యింది. సాధారణంగానే రైళ్లకు డిమాండ్ ఉంటుంది. ఫ్లైట్ల రద్దుతో మరింత పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అదనపు రైళ్లను ఉపయోగించుకుని ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచిస్తున్నాం. రద్దీ పెరిగితే, మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయి” అని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ప్రకటించారు.
Read Also: ఇండిగో సంక్షోభం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!
గత నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టులో గంటల తరబడి అవస్థలు పడుతున్నారు. ఇండిగో తన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు మరో 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: విమానయాన సంస్థను ఆర్మీకి అమ్మేస్తున్న పాక్ ప్రభుత్వం.. వాళ్లంతే అదోటైపు!