IRCTC Yadadri Srisailam MahashivRatri Tour : మహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్సిటిసి (IRCTC) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని అమలు చేస్తోంది. ప్యాకేజీలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. పూర్తి వివరాలివీ. ఫిబ్రవరి 26న శివరాత్రి వేళ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమ శివుడిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది.
బడ్జెట్ ధరలోనే శ్రీశైలం వెళ్లేందుకు టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలో భాగంగానే యాదాద్రి ఆలయాన్ని కూడా కవర్ చేసే అవకాశాన్ని కల్పించింది. ”SPIRITUAL TELANGANA WITH SRISAILAM’ (స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం) పేరుతో హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం, గొల్కోండ కోట, బిర్లామందిర్ ను సందర్శిస్తారు. చివరగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవటంతో పర్యటన ముగుస్తుంది. ఈ శివరాత్రి టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 24 నుంచి అందుబాటులో ఉంది.
ప్యాకేజీలో భాగంగా ముందుగా హైదరాబాద్ నగరంలో పిక్ అప్ చేసుకుని స్థానికంగా పేరు గాంచిన పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. ఇందులో భాగంగా సాలార్ జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్, చార్మినార్, ఉంటాయి. ఆ తర్వాత రాత్రి నగరంలోని హోటల్ లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయల్దేరి మల్లికార్జున స్వామిని దర్శించుకుని సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు.
Also Read: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్సిటిసి ఆఫర్!
మూడో రోజు ఉదయం టిఫిన్ అనంతరం బిర్లా మందిర్ వెళ్తారు. అక్కడి నుంచి గొల్కోండ కోట సందర్శన చేసి మధ్యాహ్నం ముచ్చింతల్ సమతా విగ్రహం వద్దకు బయలుదేరుతారు. ఆ రోజుకు పర్యటన ముగించుకొని రాత్రి హైదరాబాద్ హోటల్ లోనే బస చేస్తారు. 4వ రోజు ఉదయం హైదరాబాద్ లో అల్పాహారం చేశాక యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, సురేంద్రపురిని సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
హైదరాబాద్ – శ్రీశైలం ట్రిప్ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 37200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 14880గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వేరు ధరలతో పాటు గ్రూప్ సైజ్ ఒకటి నుంచి మూడుగా ఉంటుంది. టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవడానికి IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేయండి. ప్యాకేజీకి సంబంధించి ఏవైనా సందేహాలున్నా, పూర్తి వివరాలు కావాలన్నా 8287932229 / 8287932228 నెంబర్లను సంప్రదించవచ్చు.