Indian Railways Insurance: ప్రతి రోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. వారిలో చాలా మందికి భారతీయ రైల్వే సంస్థ అందిస్తున్న సదుపాయాల గురించి పెద్దగా తెలియదు. టికెట్ తీసుకున్నామా? రైలు ఎక్కి తమ గమ్యస్థానానికి చేరుకున్నామా? అనేది మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఇండియన్ రైల్వే అందించే ప్రమాద బీమా గురించి తెలుసుకుందాం. ఈ కేవలం 35 పైసల ప్రీమియంతో పెద్ద మొత్తంలో ప్రయాణ ప్రమాద బీమా పొందే అవకాశం ఉంటుంది.
రూ. 35 పైసలతో రూ. 10 లక్షల ఇన్సూరెన్స్
IRCTC వెబ్ సైట్ లేదంటే, యాప్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ సమయంలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. కచ్చితంగా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్స్ చేయగానే రైల్వే సంస్థతో టై అప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మెయిల్ ఇస్తుంది. వివరాలతో పాటు పాలసీ డాక్యుమెంట్ పంపిస్తారు. రైలు ప్రయాణం చేసే చాలా మంది ఈ ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకోవడం లేదు. అలాంటి వారు రైలు ప్రమాదం జరిగితే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నది.
ప్రమాద తీవ్రతను బట్టి ఇన్సూరెన్స్
ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది రైల్లో ప్రయాణిస్తున్న సమయలో పొరపాటున ఏదైనా ప్రమాదానికి గురై చనిపోతే ప్రయాణీకుడి కుటుంబానికి అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి బీమా సంస్థ రూ. 10 లక్షల వరకు చెల్లిస్తుంది. పూర్తి అంగవైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షలు ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 7.5 లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తుంది. వైకల్యం ఏర్పడకుండా కేవలం గాయాలతో హాస్పిటల్లో చేరితే వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్షలు అందిస్తుంది. రూ. 35 పైసలతో పలు రకాల ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ట్రైన్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే బెస్ట్ యాప్స్ ఇవే, మీరూ ట్రై చేయండి!
ఇన్సూరెన్స్ ను ఎలా పొందాలంటే?
రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోగా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లి తగిన డాక్యుమెంట్స్ అందివ్వాలి. ప్యాసింజర్ చనిపోతే, నామినీ వెళ్లి రైల్వే అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికేట్ తో పాటు వాళ్లు అడిగిన ఇతర పత్రాలు ఇవ్వాలి. డాక్యుమెంటేషన్ పూర్తి అయిన తర్వాత 15 రోజుల్లోగా బీమా డబ్బులు నామినీ అకౌంట్ లో జమ అవుతాయి. తరచుగా రైలు ప్రయాణం చేసే వాళ్లు ట్రావెల్ ఇన్సూరన్స్ తీసుకోవడం ఎంతో మంచిది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో కచ్చితంగా ఇన్సూరెన్స్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవడం మర్చిపోకూడదు. తక్కువ మొత్తంతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా పొరపాటున రైలు ప్రమాదం జరిగితే కుటుంబానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆసరాగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
Read Also: ఫ్లాట్ ఫారం టికెట్ ఉన్నా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?