London of India: భారత్ లోని అనేక నగరాలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. అదే సమయంలో ఆసక్తికరమైన పేర్లను సైతం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు జైపూర్ ‘పింక్ సిటీ’గా, ఉదయ్పూర్ ‘సిటీ ఆఫ్ లేక్స్’గా, ముంబై ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’గా ప్రసిద్ధి చెందాయి. అదే విధంగా మనదేశంలో ‘లండన్ ఆఫ్ ఇండియా’గా పిలువబడే నగరం ఉందని తెలుసా? బ్రిటిష్ కాలం నాటి లండన్ నగరాన్ని తలపించేలా అక్కడి నిర్మాణాలు, పాలనా విధానాల వల్ల ఈ సిటీకి ఆ పేరు వచ్చింది.
బెంగాల్ రాజధాని కోల్ కత్తాను ‘లండన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందింది. ఈ పేరు వెనుక కొన్ని చారిత్రక కారణాలే ఉన్నాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన ప్రధాన కార్యాలయాన్ని కోల్కతాలోనే ఏర్పాటు చేసింది. 1772 నుండి 1911 వరకు సుదీర్ఘ కాలం పాటు ఈ నగరం బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా వెలిగింది. ఆ సమయంలో దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు, వ్యాపార లావాదేవీలన్నీ ఇక్కడి నుంచే సాగేవి. ప్రధాన పాలనా కేంద్రంగా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నగరాన్ని ఐరోపా తరహాలో అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు వెచ్చించింది.
కోల్కతా నగర వీధుల్లో నడుస్తుంటే బ్రిటిష్ కాలం నాటి భవనాలు గత రోజులను గుర్తుచేస్తాయి. విక్టోరియన్, గోతిక్ రివైవల్, నియోక్లాసికల్ నిర్మాణ శైలుల్లో ఇక్కడ నిర్మించిన కట్టడాలు.. ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. తెల్లటి పాలరాతితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్.. ఇండో-గోతిక్ శైలికి ప్రతీకగా నిలిచే సెయింట్ పాల్స్ కేథడ్రల్, అదే విధంగా కలకత్తా హైకోర్టు, ఇండియన్ మ్యూజియం, రైటర్స్ బిల్డింగ్ వంటివి లండన్ వీధుల్లోని కట్టడాలను తలపిస్తాయి.
లండన్ నగర వికాసంలో ‘థేమ్స్’ నది ఎంతటి కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కోల్కతా అభివృద్ధిలో ‘హుగ్లీ’ నది అంతే ప్రధానమైనది. గంగా నదికి ప్రధాన ఉపనది అయిన హుగ్లీ ఒడ్డున ఈ కోల్కతా ఉంది. ఇక్కడి ఓడరేవులు అంతర్జాతీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చిపోయే ఓడలతో ఆ కాలంలోనే ఈ ప్రాంతం మహా నగరంగా విరాజిల్లింది.
కోల్కతాకు పాతకాలపు సౌందర్యాన్ని ఇచ్చే మరో ముఖ్యాంశం అక్కడ నడిచే ‘ట్రామ్లు’. 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ రవాణా వ్యవస్థ.. నేటికీ కొనసాగుతున్న ఏకైక భారతీయ నగరం కోల్కతానే. రద్దీగా ఉండే వీధుల గుండా మెల్లగా సాగిపోయే ఈ ట్రామ్లు.. ఐరోపా నగరాల్లోని పాత తరహా వాతావరణాన్ని కళ్లముందు ఉంచుతాయి.
Also Read: బిచ్చమెత్తే వృద్ధురాలి మృతి.. ఇంట్లో చూడగా అందరూ షాక్.. 30 మూటల్లో డబ్బే డబ్బు!
కేవలం నిర్మాణాలకే కాకుండా కళలు, సాహిత్యం, నాటకరంగం, తత్వశాస్త్రంలో కోల్కతా అగ్రస్థానంలో నిలుస్తోంది. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు ఈ నేలకు చెందినవారే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘దుర్గాపూజ’ వేడుకలు.. కోల్ కతాలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మెుత్తంగా చూస్తే చరిత్ర, ఆధునికత రెండూ సమపాళ్లలో కలగలిసిన కోల్కతాను బ్రిటిష్ కాలం నాటి కట్టడాల కారణంగా ‘లండన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. అయితే తనదైన ప్రత్యేక సంస్కృతితో ఈ నగరం దేశంలోనే అత్యంత విశిష్టమైన నగరంగా గుర్తింపు సంపాదించింది.
Also Read: కాంగ్రెస్లోనే ఉంటారా లేక గుడ్ బై చెప్తారా.. కొండా సురేఖ ఎపిసోడ్పై ఉత్కంఠ!