Eiffel Tower Safety Design: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఇటీవల భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్పై భారీ పిడుగు పడిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్లటి మేఘాల మధ్య ఒక్కసారిగా మెరుపు వచ్చి టవర్ ను తాకడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోలు చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఎన్ని పిడుగులు పడినా, ఈ టవర్ కు ఏమాత్రం నష్టం కలగదంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఈఫిల్ టవర్ పై పిడుగులు పడటం కొత్త విషయం కాదంటున్నారు. ప్రతి ఏడాది సగటున ఐదు నుంచి పది సార్లు వరకు టవర్ ను నేరుగా పిడుగులు పడుతుంటాయి. టవర్ ఎత్తు దాదాపు 330 మీటర్లు ఉండటంతో తుఫానుల సమయంలో పిడుగులు పడుతాయి.
పిడుగు ఎప్పుడూ ఒక ప్రాంతంలో ఉన్న ఎత్తైన, విద్యుత్ ను సులభంగా ప్రసారం చేసే వస్తువుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈఫిల్ టవర్ పై తరచుగా పిడుగులు పడుతాయి. అయితే, టవర్ పిడుగులను తనవైపు లాగుతుందని అనుకోవడం సరైనది కాదంటున్నారు నిపుణులు. పిడుగు ఏర్పడినప్పుడు భూమిని చేరేందుకు అత్యంత సులభమైన మార్గంగా ఈ నిర్మాణం పనిచేస్తుందంటున్నారు.
ఈఫిల్ టవర్ నిర్మాణంలో ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మొత్తం టవర్ ఒక పెద్ద ఫారడే కేజ్ లాగా పని చేస్తుంది. అంటే, పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రవాహం టవర్ లో ఉన్న సందర్శకుల శరీరాల ద్వారా కాకుండా, ఇనుప నిర్మాణం గుండా కిందికి వెళ్లిపోతుంది. టవర్ అడుగుభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రౌండింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఇవి పిడుగు ద్వారా వచ్చిన విద్యుత్ ను కొన్ని క్షణాల్లోనే భూమిలోకి పంపిస్తాయి. దీంతో టవర్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు.
అంతేకాదు, టవర్ లోని ఎలివేటర్లు, లైటింగ్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించడానికి అత్యాధునిక సర్జ్ ప్రొటెక్షన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యుత్ ప్రవహించినా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. భారీ ఉరుములు, బలమైన గాలులు, తీవ్ర తుఫాను పరిస్థితులు ఉంటే, టవర్ లోని కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తారు. అయితే, పిడుగు పడటం వల్ల టవర్ కు నిర్మాణపరమైన నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
పిడుగు నేరుగా ఈఫిల్ టవర్ మీద పడటం చూసేందుకు భయం కలిగిస్తుంది. కానీ, ఈ చారిత్రక కట్టడం ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకునేలా, అత్యంత సురక్షితంగా రూపొందించబడింది. అందుకే, పిడుగులు పడినా ఈఫిల్ టవర్ సందర్శకులకు పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read Also: లడఖ్ ప్రజలను కాపాడుతున్న మంచు స్థూపం.. ఇది లేకపోతే ఏమైపోయేవాళ్ళో!