దేశంలో విస్తారమైన రైల్వే నెట్ వర్క్ ఉంది. అన్ని రాష్ట్రాలను కలిపేలా రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో 1,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే, దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ఇంతకీ దాని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం..
మిజోరాంలో ఏకైక రైల్వే స్టేషన్
దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్ పేరు బైరాబి. ఈ స్టేషన్ దేశంలోని తూర్పున ఉన్న రాష్ట్రాల రైల్వేకు ఎండింగ్ పాయింట్ గా ఉంటుంది. కోలాసిబ్ జిల్లాలోని బైరాబి పట్టణంలో ఉన్న ఈ స్టేషన్ మొత్తం రాష్ట్రానికి ఏకైక రైల్వే కనెక్షన్ గా పని చేస్తుంది. మిజోరాంకు రైలు ద్వారా రవాణా చేయబడిన, మిజోరాం నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వస్తువులు అన్నీ ఈ స్టేషన్ నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఆ రాష్ట్రంలోని ఏకైక, చివరి రైల్వే స్టేషన్. దీని దాటి రైల్వే లైన్ విస్తరించే అవకాశం లేదు. అందుకు భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఎక్కడికి వెళ్లాలన్నీఈ స్టేషన్ కు రావాల్సిందే!
మిజోరాంలో 11 లక్షల జనాభా ఉంటుంది. ఇక్కడి ప్రజలకు రాకపోకలకు సంబంధించి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఏకైక రైల్వే స్టేషన్ కావడంతో బైరాబికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు రైలు ప్రయాణాల కోసం ఇక్కడికి వస్తారు. బైరాబి రైల్వే స్టేషన్ ఉత్తర మిజోరాంలోని, ఐజ్వాల్ నగరం నుంచి దాదాపు 90 కి.మీ దూరంలో ఉంది. ఈ స్టేషన్ లో మొత్తం మూడు ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. 2016లో దీనిని అప్ గ్రేడ్ చేశారు. స్టేషన్ ను పునర్నిర్మాణం చేసినప్పటికీ ప్లాట్ఫారమ్ ల సంఖ్య పెరగలేదు. బైరాబి రైల్వే స్టేషన్ అస్సాంలోని కటఖల్ జంక్షన్ కు 84 కి.మీ దూరంలో అనుసంధానించబడి ఉంది. అదనంగా, భారతీయ రైల్వే సంస్థ మిజోరాంలో మరొక రైల్వే స్టేషన్ ను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇది రాష్ట్రానికి కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉంది.
మిజోరాంలో ఒకే ఒక్క స్టేషన్ ఎందుకు ఉందంటే?
మిజోరాంలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉండటానికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులు. ఈ రాష్ట్రం ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ రైల్వే ట్రాక్ లను వేయడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రెండవ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, ఈ స్టేషన్ ఎక్కడ నిర్మించాలనే అంశంపై గత కొద్ది కాలంగా రైల్వే అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల తర్వాత రెండో రైల్వే స్టేషన్ పనులకు పునాది రాయి పడే అవకాశం ఉంటుంది. ఈ స్టేషన్ నిర్మాణం జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందనుంది.
Read Also: ఖతార్ రోడ్లు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా?