BIG TV LIVE Originals: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికీ సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 వరకు భారత్ లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. అయితే, భారత్ కు పోటీగా పాకిస్తాన్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న రైల్వే వ్యవస్థ సరిగా నిర్వహించలేక ఆపసోపాలు పడుతున్న పాకిస్తాన్.. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
లాహోర్-వాల్పిండి మధ్య బుల్లెట్ రైలు
రీసెంట్ గా పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ లాహోర్-రావల్పిండి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని ఈ రైలు కేవలం రెండున్నర గంటలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు నగరాల మధ్య ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం, భూసేకరణకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని దీర్ఘకాలిక ప్రయోజనాలు పాకిస్తాన్ లోమెరుగైన రవాణా, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మోటార్ వే మోడల్ ప్రేరణగా..
1997లో అప్పటి ప్రధాన మంత్రి, సీఎం మరియం తండ్రి నవాజ్ షరీఫ్ లాహోర్-ఇస్లామాబాద్ మోటార్ వే (M-2)ను ప్రాంభించారు. మొదట్లో దానిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రాథమిక మౌలిక సదుపాయాలతో ఇబ్బంది పడుతున్న దేశంలో దాని ఖర్చు, సాధ్యాసాధ్యాలు, ఆవశ్యకతపై విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో, పాకిస్తాన్లో చాలా చోట్ల కనీసం రోడ్లు కూడా లేవు. అయినప్పటికీ, దాదాపు మూడు దశాబ్దాల తరువాత, M-2 పాకిస్తాన్ లో గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అదే మోటార్ వే ఇప్పుడు పాకిస్తాన్ వాణిజ్యం, కనెక్టివిటీకి జీవనాధారంగా మారింది. ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇంటర్ సిటీ వ్యాపారాన్ని సులభతరం చేసింది. పర్యాటక రంగాన్ని పెంచింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్రాంతీయ అభివృద్ధిని పెంచింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా మోటార్ వే నెట్ వర్క్ కు పునాది పడేలా చేసింది.
అదే చొరవతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు
మోటార్ వే ఆదర్శంగా తీసుకొని బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. “బుల్లెట్ రైలు ద్వారా పాత రైల్వే వ్యవస్థకు కొత్త జవసత్వాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని భావిస్తున్నాం. నగరాలను అనుసంధానిస్తూ, ప్రజల రవాణా సమయాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రకారం పాకిస్తాన్ రైల్వేతో కలిసి పని చేస్తున్నాం అని మంత్రి మరియం ఔరంగజేబ్ అన్నారు.
లాహోర్- రావల్పిండి కారిడార్ లో బుల్లెట్ రైలు
లాహోర్-రావల్పిండి కారిడార్ పాకిస్తాన్లో అత్యంత రద్దీగా ఉండే మార్గం. విద్య, ఉద్యోగం, ఉపాధి పనుల కోసం నిత్యం 10 వేల మంది ప్రయాణిస్తారు. మొత్తం 280 కిలోమీటర్ల మార్గంలో హై-స్పీడ్ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో హైవే రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. పంజాబ్ అంతటా.. లాహోర్ నుంచి నరోవాల్, ఫైసలాబాద్ నుంచి షహీనాబాద్ వరకు ఆరు అదనపు హై-స్పీడ్ రైలు మార్గాల కోసం ముఖ్యమంత్రి మరియం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. జూన్లో నివేదికలు రావాల్సి ఉంది. ఈ మార్గాలను ఆధునీకరించి పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు చేపడుతున్నారు.
బుల్లెట్ రైలుకు ఎదురయ్యే సవాళ్లు
బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను దశలవారీగా చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుత రైలు ట్రాక్ను గంటకు 160 కి.మీ. వేగంతో నడిచేలా ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పనితీరు, ప్రయాణీకుల డిమాండ్, ఆర్థిక స్థిరత్వం ఆధారంగా మున్ముందు పూర్తి హై-స్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. లాహోర్- రావల్పిండి మధ్య ఉన్న ట్రాక్ పాతది. చాలా వంకలు తిరిగి ఉంటుంది. నది వంతెనలు కలిగి ఉంది. బుల్లెట్ రైలు గంటకు 300 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో అనుకూలమైన రోలింగ్ స్టాక్ అందుబాటులో లేదు. వాటిని దిగుమతి చేసుకోవడానికి లేదంటే తయారు చేయడానికి కోట్ల రూపాయలు అవసరం. ఈ ప్రాజెక్టులో విదేశీ పెట్టుబడితో పాటు ప్రైవేట్ భాగస్వాములు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఎంత వరకు ఈ ప్రయాత్నాలు ముందుకు వెళ్తాయనేది చూడాలి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: భారతీయ రైల్వే మరో ఘనత, అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను ప్రారంభించిన ప్రధాని!