Indian Railways: కాశ్మీర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. కాశ్మీర్ లోయకు నేరుగా రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న కత్రా-శ్రీనగర్ రైలు సేవలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశ్మీర్ వాసుల దశాబ్దాల స్వప్నాన్ని నెరవేర్చనున్నారు. ఈ మార్గంలో సరికొత్త వందేభారత్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. అంతకు ముందు చీనాబ్ నది మీద నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఆయన పరిశీలిస్తారు. సంగల్డాన్-బారాముల్లా మధ్య, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కత్రా వరకు రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పడు కాశ్మీర్ లోయతో నేరుగా కనెక్టివిటీ అందనుంది.
రైల్వే సర్వీస్ ప్రారంభాన్ని ధృవీకరించిన జితేంద్రసింగ్
కత్రా-శ్రీనగర్ రైల్వే లింక్ కు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్స్ నిర్వహించారు. అవసరమైన భద్రతా అనుమతులు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రైల్వే సర్వీసు ప్రారంభానికి ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 19న ప్రధాని మోడీ కత్రా నుంచి కాశ్మీర్ లోయకు రైలు సేవలను ప్రారంభిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ధృవీకరించారు. ప్రధాని మోడీ ఆ రోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ఉధంపూర్ ఆర్మీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను సందర్శిస్తారు. దాని నిర్మాణం, ఇతర అంశాలపై రైల్వే అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకుంటారు. వంతెనను సందర్శించిన తర్వాత, కొత్త రైల్వే సర్వీసును ప్రారంభించేందుకు కత్రాకు వెళ్తారు. ఈ రైల్వే సర్వీస్ ప్రారంభించిన తర్వాత కత్రాలో జరిగే సభలో పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సి, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొంటారు.
ముందు కత్రా నుంచి రైల్వే సేవలు ప్రారంభం
ప్రధాని మోడీ ప్రారంభించే రైలును కొంతకాలం పాటు కత్రా- శ్రీనగర్ మధ్య నడుపుతారు. జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు కంప్లీట్ అయ్యాక జమ్మూ వరకు ఈ సేవలను విస్తరిస్తారు. అప్పటి నుంచి రైలు సర్వీసులు జమ్మూ- శ్రీనగర్- బారాముల్లా మార్గంలో కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేరుగా రైలు సర్వీసులు లేవు. దశాబ్దాలుగా కశ్మీర్ లోయకు భారత్ లోని ఇతర భూభాగాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సంగల్దాన్–బారాముల్లా సెక్షన్ వరకే వస్తాయి. సుదూర సర్వీస్ రైళ్లు కత్రా వరకు వస్తాయి. తాజా రైల్వే సర్వీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కశ్మీర్ లోయ ప్రాంత వాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను పొందే అవకాశం ఉంటుంది.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ గురించి
2005-06లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయి. కాశ్మీర్ లోని 118 కి.మీ ఖాజిగుండ్- బారాముల్లా మార్గాన్ని అక్టోబర్ 2009లో ప్రారంభించారు. ఆ తర్వాత 18-కి.మీ బనిహాల్-కాజిగుండ్, 25-కి.మీ ఉధంపూర్- కత్రా విభాగాలను 2013, 2014లో పూర్తి చేశారు. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్- సంగల్దాన్ మార్గాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు, 46 కిలోమీటర్ల సంగల్దాన్-రియాసి సెక్షన్ పనులు కూడా గత ఏడాది జూన్ లో పూర్తయ్యాయి. రియాసి- కత్రా మధ్య మొత్తం 17 కిలోమీటర్ల దూరం మిగిలిపోయింది. ఈ పనులు కూడా సుమారు మూడు నెలల క్రితం పూర్తయింది. ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. 272 కి.మీ. పొడవు ఉన్న USBRL ప్రాజెక్ట్ లో మొత్తం 38 సొరంగాలు ఉన్నాయి.వాటిలో పొడవైనది T-49. ఇది సుమారు 12.75 కి.మీ పొడవు ఉంటుంది.
Read Also: వామ్మో! రోజూ అన్ని లక్షల మందికి ఫుడ్ అందిస్తారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!