Kacheguda Railway Station Redevelopment: హైదరాబాద్ లోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్కు త్వరలోనే ఆధునిక హంగులు అద్దుకోనుంది. అయితే, ఈ అభివృద్ధి పనుల్లో స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన 110 ఏళ్ల పురాతన వారసత్వ భవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిరక్షించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ ప్రాజెక్టులో చారిత్రక నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా అన్ని పనులు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపించారు. ప్రస్తుతం తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించబడింది. అప్పట్లో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయంగా ఈ స్టేషన్ సేవలందించింది. హైదరాబాద్ ను ముంబైతో పాటు పశ్చిమ భారతం లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ 110 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని నగరంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ నుంచి ప్రతి రోజు 50 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, తిరుపతి, మంగళూరు, భోపాల్ తో పాటు పలు ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తున్నాయి.
ఈ స్టేషన్ ప్రత్యేకత దాని నిర్మాణ శైలిలోనే కనిపిస్తుంది. మధ్యలో ఉన్న పెద్ద గోపురం, రెండు వైపులా మినార్లు, గోతిక్ శైలిలో నిర్మించిన ఆకర్షణీయమైన భవనం ఈ స్టేషన్కు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. అందుకే దీన్ని హైదరాబాద్ నగర వారసత్వ గుర్తుల్లో ఒకటిగా భావిస్తారు. పునర్నిర్మాణ సమయంలో పాత భవనం రూపురేఖలు ఏమాత్రం మారవు. చారిత్రక ముఖభాగం, అసలు నిర్మాణ శైలిని అలాగే ఉంచుతూ, దాని చుట్టూ ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దీంతో వారసత్వ విలువను కాపాడుతూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు.
కొత్త ప్రాజెక్టులో విశాలమైన కాన్ కోర్స్, అత్యాధునకి వెయిటింగ్ హాల్స్, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు సులభమైన రాకపోకల కోసం సదుపాయాలు, మెరుగైన పార్కింగ్, డిజిటల్ ప్రయాణికుల సమాచార వ్యవస్థ, వాణిజ్య సముదాయాలు, పలు రకాల రవాణా వ్యవస్థలతో లింకేజ్ లాంటి సౌకర్యాలను కల్పించనున్నారు. దీంతో స్టేషన్ మరింత మోడ్రన్ గా మారనుంది.
కాచిగూడ స్టేషన్ పర్యావరణ పరిరక్షణలో కూడా మంచి గుర్తింపు పొందింది. ఇందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ను అందుకుంది. ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ రూ.2.2 కోట్లతో ప్రత్యేక ఫసాడ్ లైటింగ్ ప్రాజెక్టును అమలు చేసింది. దీంతో రాత్రి వేళల్లో ఈ చారిత్రక భవనం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ద్వారా ఆధునికతతో పాటు చరిత్రను కూడా సంరక్షించనున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్కు మరో ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది.
Read Also: 12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!