Pallavi Prashanth:తెలుగు బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి వార్తల్లో నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. విన్నర్గా గెలుచుకున్న ప్రైజ్మనీని రైతులకు పంచుతానని చెప్పి మాట తప్పాడంటూ ఆయనపై ఇప్పటివరకు తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే తాజాగా ఇచ్చిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ స్పందిస్తూ, బిగ్బాస్ యాజమాన్యం గిఫ్ట్ల పేరుతో తనను ఎలా మోసం చేసిందో బయటపెడుతూ సంచలన విషయాలు పంచుకున్నాడు.
గెలుచుకున్న డబ్బు తన చేతికి రావడానికి చాలా సమయం పట్టిందని ప్రశాంత్ తెలిపాడు. రూ.35 లక్షల ప్రైజ్మనీలో ఏకంగా 40 శాతం జీఎస్టీ కింద కట్ అయిందని పేర్కొన్నాడు. ఇక ఉచితంగా ఇస్తున్నామన్న కారు కోసం రూ.8.5 లక్షలు, టీమ్ ఇచ్చిన గిఫ్ట్ అన్న నెక్లెస్ కోసం రూ.5 లక్షల గిఫ్ట్ ట్యాక్స్ కట్టమన్నారని, ఆ డబ్బులు కడితేనే ఇవి ఇస్తామని నిర్దాక్షిణ్యంగా చెప్పారని తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ALSO READ:ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?
మొత్తం రూ.35 లక్షల ప్రైజ్మనీలో జీఎస్టీ కింద రూ.14 లక్షలు, కారు కోసం రూ.8.5 లక్షలు, నెక్లెస్ కోసం రూ.5 లక్షలు పోగా చివరికి తన చేతికి మిగిలింది కేవలం రూ.7.5 లక్షలు మాత్రమేనని లెక్కలతో సహా వివరించాడు. ఇక ఈ కారణంగానే అనుకున్న స్థాయిలో సహాయం చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గిఫ్ట్లు అని చెప్పి రూల్స్ పేరుతో భారీగా కోతలు విధించారని ప్రశాంత్ ఆరోపించాడు.
అయితే గతంలో శివ అనే యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ పూర్తిగా భిన్నంగా మాట్లాడాడు. “నేను చేయాల్సిన సాయం చేశాను, ఇచ్చిన వారికి తెలుసు. నా సాయంతో ఒక చెల్లి చదువుకుని కాలేజ్ ఫస్ట్ వచ్చింది, కానీ వాళ్లు బయటకు చెప్పడానికి ఇష్టపడట్లేదు” అని గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రైజ్మనీ కోతల గురించి కొత్త ఆరోపణలు చేయడంతో ఈ రెండింటిలో ఏది నిజమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక సామాన్యుడిగా హౌస్లోకి వెళ్లిన ప్రశాంత్ ఇన్ని ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బిగ్బాస్ యాజమాన్యం నుంచి ఈ ప్రైజ్ మనీ కటింగ్లపై ఏదైనా అధికారిక వివరణ వస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావు. ఇక ప్రశాంత్ చేసిన ఆరోపణలు నిజమైతే గిఫ్ట్ల పేరుతో బిగ్బాస్ నిర్వాహకులు చేసే బిజినెస్ ఏంటో అందరికీ అర్థమవుతుంది.