22A Land: సొంత ఇల్లు, సొంత భూమి అనేది సామాన్యుడి జీవితంలో ఒక కల, ఒక ధైర్యం. కానీ ఆ ధైర్యాన్ని లాగేసుకుంది 22A నిషిద్ధ జాబితా. భూమి తమదే అని నిరూపించుకోవడానికి కాగితాలు చేతపట్టుకుని, ఏళ్లకు ఏళ్లుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు బాధితులు. ఈ నరకయాతనకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బై-నంబర్లు, వివాదాస్పద భూముల సమస్యలకు చెక్ పెడుతూ… బాధితుల దరఖాస్తులను కేవలం 3 రోజుల్లోనే తేల్చాలని ఆదేశించింది. ఈ నెల 14లోగా సంబంధిత దస్త్రాలన్నింటినీ ఆన్లైన్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇన్నాళ్లూ సబ్రిజిస్ట్రార్ల విచక్షణాధికారాల పేరుతో, అధికారుల కొర్రీల పేరుతో నలిగిపోయిన వేలాది మంది బాధితులకు ఇది కొండంత ఊరట. ప్రభుత్వం గడువు విధించింది సరే… కానీ కింది స్థాయి అధికారులు ఈ భావోద్వేగాన్ని, బాధితుల వేదనను అర్థం చేసుకుని పనిచేస్తారా? ఇన్నాళ్లూ ఆఫీసుల చుట్టూ తిప్పి ఏడిపించినట్లే మళ్లీ కాలయాపన చేస్తారా? ఏది ఏమైనా… తన సొంత నేలపై పూర్తి హక్కు కోసం దశాబ్దాలుగా కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న సామాన్యుడి కళ్లలో, ఈ నిర్ణయం ఒక కొత్త నమ్మకాన్ని నింపింది.