Soil Mafia: కడప జిల్లాలో మట్టి మాఫియాకు అడ్డుఆపు లేకుండా పోతోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వందల టిప్పర్లతో మట్టిని తరలించేస్తున్నారు. హైవే నిర్మాణానికి మట్టి అవసరమే కదా అనిపించొచ్చు. కానీ, మట్టి తవ్వకానికి అనుమతులు ఒక దగ్గర తీసుకొని.. తవ్వకాలు మరో దగ్గర చేస్తున్నారు. అంతే కాదు.. ఆ మట్టిని హైవే నిర్మాణానికి మాత్రమే వాడుతున్నారనే గ్యారెంటీ కూడా లేదు.
విలువైన మట్టి ఎక్కడ ఉంటే అక్కడ..
మైదుకూరు మండలం గగ్గితిప్ప దగ్గర కొండలో తవ్వకాలు చూస్తే మతి పోతుంది. మరికొన్ని రోజులు తర్వాత.. గతంలో అక్కడో కొండ ఉండేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు.. విలువైన మట్టి ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. యదేచ్చగా దోచేస్తూ రోజూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటు వైపు చూడడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే కొండలకు బోడిగుండులు అయిపోతున్నాయనే వాళ్లు కూడా ఉన్నారు.
రైతులు పొలాలకు మట్టిని తీసుకెళ్తే కేసులు పెట్టే అధికారులు.. ఏకంగా విలువైన సహజవనరులు తరలిపోతుంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ యాప్తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!